
సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఎన్నికల ఫలితాల్లో అధికారపార్టీ అక్రమాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 స్థానాల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలిచినప్పటికీ ఫలితాలను తారుమారు చేస్తారా అని ప్రశ్నించారు. సెస్ ను నాశనం చేసిన బీఆర్ఎస్ కు ఓట్లేయలేదనే అక్కసుతోనే ఇదంతా చేస్తున్నారని బండి సంజయ్ ఫైర్ అయ్యారు.
సెస్ ఎన్నికల్లో బీఆర్ఎసోళ్లే ఓట్లేసుకుని, వాళ్లే ఫలితాలు ప్రకటించుకుంటున్నారని బండి సంజయ్ అన్నారు. అలాంటప్పుడు ఎన్నికల నిర్వాహణ, ఫలితాల ప్రకటన పేరుతో జనం సమయాన్ని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఎందుకని ప్రశ్నించారు. అధికారం చేతుల్లో ఉందని బీఆర్ఎస్ ఇష్టానుసారం వ్యవహరిస్తోందని బండి మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతల తీరు చూసి జనం అసహ్యించుకుంటున్నా సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆటలు చెల్లవన్న ఆయన.. కేసీఆర్ చెంప చెళ్లుమనిపించేందుకు జనం సిద్ధంగా ఉన్నారని చెప్పారు.