
- తెలంగాణ తల్లికి కేసీఆర్ ద్రోహం చేసిండు
- మోడీని ఎదుర్కొనేందుకు గుంట నక్కలంతా ఏకమైతున్నయ్
కరీంనగర్/జగిత్యాల, వెలుగు: ‘‘రోజంతా ప్రధాని నరేంద్రమోడీని తిడుతున్న సీఎం కేసీఆర్.. ఏపీ సీఎం జగన్తో కుమ్మక్కయిండు. మళ్లా తెలంగాణ సెంటిమెంట్ను రగిలించి ప్రయోజనం పొందాలని కుట్ర చేస్తున్నరు” అని బీజేపీ స్టేట్చీఫ్, కరీంనగర్ ఎంపీ సంజయ్ మండిపడ్డారు. ఇద్దరు సీఎంలు కలిసి దోచుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా కరీంనగర్లో జరిగిన బహిరంగ సభలో సంజయ్ మాట్లాడారు. గడీల పాలనను బద్దలు కొట్టేందుకే తాను పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. ‘‘కేసీఆర్ పాలనలో ఏ వర్గానికీ మేలు జరగలేదు. కేసీఆర్ కుటుంబం భూమి, గ్రానైట్, సాండ్ స్కాంలకు పాల్పడుతున్నది. తెలంగాణ తల్లికి ద్రోహం చేసిన మూర్ఖుడు కేసీఆర్. బీఆర్ఎస్ పేరుతో తెలంగాణను పక్కనబెట్టిండు. బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి” అని విమర్శించారు. సింగిల్ గా వచ్చే సింహం లాంటి మోడీని ఎదుర్కొనేందుకు గుంట నక్కలంతా ఏకమవుతున్నాయని అన్నారు. కేంద్ర నిధులను కేసీఆర్ దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. ‘‘డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో ప్రజలను కేసీఆర్ మోసం చేసిండు. బీజేపీ అధికారంలోకి వచ్చాక పేదలకు ఇల్లు కట్టిస్తం. కేసీఆర్ పాలనలో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నరు. బీజేపీ అధికారంలోకి రాగానే ప్రతి నెల ఒకటిన జీతాలు ఇస్తం” అని తెలిపారు. ధరణి పేరుతో ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, మళ్లీ అధికారం ఇస్తే ఇంకిన్ని అప్పులు చేస్తారని కేసీఆర్పై ఆయన మండిపడ్డారు.
ధర్మానికి, సమాజానికి తలవంపులు తేను
కరీంనగర్ తనకెంతో ఇచ్చిందని, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓడిపోతే కార్యకర్తలు ఏడ్చారని సంజయ్ అన్నారు. ‘‘నేను మొదట ఇక్కడి కార్పొరేటర్ని. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేను ఓడిపోతే కార్యకర్తలు ఏడ్చారు. దానిపై దేశమంతా చర్చ జరిగింది. ధర్మానికి, సమాజానికి తలవంపులు తెచ్చే పని ఎప్పటికీ చేయను. కార్యకర్తల కష్టంతోనే కరీంనగర్ ఎంపీగా గెలిచిన. ఇక్కడి ప్రజలు కరీంనగర్ లో పింక్ జెండాను బొంద పెట్టి కాషాయ జెండాను రెప రెపలాడించిన్రు” అని ఆయన భావోద్వేగానికి గురయ్యారు.