టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. 2026 ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కోసం భారత టీ20 జట్టును శనివారం (డిసెంబర్ 20) ప్రకటించనున్నారు. వరల్డ్ కప్ కు రెండు నెలల సమయం కూడా లేదు. దీంతో 15 మందితో కూడిన భారత స్క్వాడ్ తో పాటు రిజర్వ్ ఆటగాళ్లను శుక్రవారం (డిసెంబర్ 19) ఎంపిక చేయనున్నారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ముంబై ప్రధాన కార్యాలయంలో సమావేశం కానుంది. ఈ మీటింగ్ లో టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ఖరారు చేయనుంది. వరల్డ్ కప్ స్క్వాడ్ తో పాటు న్యూజిలాండ్ లో జరగబోయే వన్డే, టీ20 సిరీస్ కోసం జట్టును ప్రకటించనున్నారు.
"సీనియర్ మెన్స్ సెలక్షన్ కమిటీ శనివారం (డిసెంబర్ 20) ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సమావేశమై న్యూజిలాండ్తో జరిగే టీ20 సిరీస్ తో పాటు 2026 ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ఎంపిక చేస్తుంది. దీని తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, సెలక్షన్ కమిటీ చైర్పర్సన్ అజిత్ అగార్కర్ విలేకరుల సమావేశం నిర్వహిస్తారు" అని BCCI శుక్రవారం తెలిపింది. ఫిబ్రవరి 7 నుంచి వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ కంటే ముందు జనవరి 11 నుండి 31 వరకు భారత జట్టు స్వదేశంలో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ లు ఆడనుంది.
Also Read : గాయంతోనే అహ్మదాబాద్ చేరుకున్న గిల్..
2026 టీ20 వరల్డ్ కప్ ను భారత్, శ్రీలంకలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. టోర్నమెంట్ లో భాగంగా తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న పాకిస్తాన్- నెదర్లాండ్ మధ్య జరగుతుంది. క్రికెట్ ప్రపంచంలో అత్యంత రసవత్తరంగా, ఫ్యాన్స్ థ్రిల్లింగ్ గా ఫీలయ్యే ఇండియా-పాక్ జట్ల మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలో జరగనుంది. ఇండియా, పాకిస్తాన్ , అమెరికా(USA), నమీబియా, నెదర్లాండ్స్ ఒకే గ్రూపులో ఉన్నాయి. భారత్లో జరిగే మ్యాచ్ లు 5 స్టేడియాల్లో జరుగుతాయి. అహ్మదాబాద్, దిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబయి స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇక శ్రీలంక లో 3 వేదికల్లో నిర్వహించనున్నారు. ప్రారంభ, ఫైనల్ మ్యాచ్లు అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు.
ఈసారి ఈ మెగా టోర్నీలో 20 జట్లు తలపడనున్నాయి. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, యూఏఈ, ఒమన్, వెస్టిండీస్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, ఐర్లాండ్, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, ఇటలీ, నేపాల్, పాకిస్థాన్ జట్లు టోర్నమెంట్ లో భాగం కానున్నాయి. మధ్యాహ్నం 1:30 గంటలకు స్క్వాడ్ ను ప్రకటించనున్నారు.
