తెలంగాణలో భూ వివాదాలకు చెక్ పెట్టనుంది ప్రభుత్వం. ఏప్రిల్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి సేవలు అమలు చేయనుంది. ప్రయోగాత్మకంగా 5 మండలాల్లో పోర్టల్ ప్రారంభం కానుంది. ఖమ్మం జిల్లా కూసుమంచి, భద్రాద్రి జిల్లా అశ్వరావుపేట, రంగారెడ్డి జిల్లా ఆమన్ గల్, సంగారెడ్డి జిల్లా వట్ పల్లి,నారాయణపేట జిల్లా కోస్గి మండలాల్లో భూభారతి అమలు సేవలు ప్రారంభం కానున్నాయి.
ఈ మేరకు పోర్టల్ ప్రారంభంపై ఇవాళ (ఏప్రిల్ 1) అధికారులతో మంత్రి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి రివ్యూ నిర్వహించారు . ఈ సందర్భంగా భూభారతితో భూవివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు.
ఈ ఐదు మండలాల్లో వచ్చే ఫలితాలను బట్టి అవసరమైన మార్పులు చేసి, రెండో దశలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు. ఎన్నికల హామీ మేరకు భూభారతి చట్టాన్ని తెచ్చామని, వ్యవసాయ భూముల క్రయవిక్రయాల సమయంలో సర్వే మ్యాపును జతపరిచే నిబంధనను కూడా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
ప్రతీ సర్వే నంబర్కు భూధార్..
ఈ ఐదు మండలాల్లో ప్రతీ సర్వే నంబర్కు ఆధార్ తరహాలోనే భూధార్ నంబర్ను కేటాయించనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఇప్పటికే నక్ష లేని ఐదు గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి, భూధార్ ఇచ్చినట్లు గుర్తు చేశారు.
ఒక్క క్లిక్తో రైతుల భూములకు సంబంధించిన పూర్తి సమాచారం లభించేలా పోర్టల్ను రూపొందించామని, ఆధార్తో అనుసంధానమైన మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి వివరాలు పొందవచ్చని చెప్పారు. ధరణిలో 36 మాడ్యూల్స్ ఉండగా.. వాటి గందరగోళానికి చెక్పెడుతూ భూభారతిలో అన్నింటినీ ఒకే చాప్టర్ కిందకు తీసుకువచ్చినట్లు స్పష్టం చేశారు.
