బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్‌‌‌‌ ప్రైజ్‌‌‌‌మనీ సగానికి తగ్గింపు

బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్‌‌‌‌ ప్రైజ్‌‌‌‌మనీ సగానికి తగ్గింపు

విజేతకు ఇచ్చేది పది కోట్లే

ఫ్రాంచైజీల అసంతృప్తి

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌‌‌ నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. పదమూడో సీజన్‌‌‌‌ విజేతలకు ఇచ్చే ప్రైజ్‌‌‌‌మనీలో భారీ కోత విధించింది.  చాంపియన్‌‌‌‌గా నిలిచిన జట్టుకు ఇచ్చే ప్రైజ్‌‌‌‌మనీని రూ.10 కోట్లకు తగ్గించింది. గతంలో ఇది రూ.20 కోట్లుగా ఉండేది. అదే విధంగా రన్నరప్‌‌‌‌గా నిలిచిన టీమ్‌‌‌‌కు ఇచ్చే మొత్తాన్ని రూ.12.5 కోట్ల నుంచి రూ.6.25 కోట్లకు తగ్గించింది. క్వాలిఫయర్స్‌‌‌‌లో ఓడిన జట్లకు రూ.4.3 కోట్లు చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఫ్రాంచైజీలకు సమాచారం అందజేసింది. ఇది కాక ఐపీఎల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లకు ఆతిథ్యమిచ్చే స్టేట్‌‌‌‌ అసోసియేషన్లకు ఒక్కో గేమ్‌‌‌‌కు రూ.1 కోటి చొప్పున అందనుంది. ఈ మొత్తాన్ని ఫ్రాంచైజీలు, బీసీసీఐ చెరో సగం భరించనున్నాయి.  అయితే స్పాన్సర్‌‌‌‌షిప్‌‌‌‌లు, ఇతర మార్గాల ద్వారా ఫ్రాంచైజీలు ఆర్థికంగా బలంగానే ఉన్నాయని, అందుకే ప్రైజ్‌‌‌‌మనీని తగ్గించామని బీసీసీఐకి చెందిన ఓ సీనియర్‌‌‌‌ అధికారి అన్నారు. కానీ తమతో చర్చించకుండా ప్రైజ్‌‌‌‌మనీలో కోత విధించడంపై  ఐపీఎల్‌‌‌‌ ఫ్రాంచైజీలు అసంతృప్తిగా ఉన్నాయి. త్వరలో అన్ని జట్ల
అధికారులు కలిసి ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని ఓ ఫ్రాంచైజీకి చెందిన అధికారి చెప్పారు.