
ఉమెన్స్ ఐపీఎల్కు రంగం సిద్ధమైంది. మొట్ట మొదటిసారిగా మహిళ క్రికెట్ లీగ్ను బీసీసీఐ నిర్వహిస్తోంది. ఈ ఏడాది ఐదు ఫ్రాంచైజీలతో మహిళల ఐపీఎల్ జరగనుందని బీసీసీఐ ప్రకటించింది. మెన్స్ ఐపీఎల్కు ముందే ఉమెన్స్ ఐపీఎల్ జరగనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే మీడియా హక్కుల కోసం టెండర్లు పిలిచిన బీసీసీఐ..తాజాగా జట్ల ఎంపిక, ప్లేయర్ల వేలంపై దృష్టి సారించింది. మెన్స్ మాదిరిగానే ఉమెన్స్ కోసం వేలం నిర్వహించనుంది. ఈ వేలంలో పేర్లు నమోదు చేసుకునేందుకు జనవరి 26న డెడ్ లైన్ విధించింది.
కనీస ధర...
ఉమెన్స్ ఐపీఎల్లో పేర్లు నమోదు చేసుకున్న ప్లేయర్ల కనీస ధరను బీసీసీఐ ఐదు విభాగాలుగా విభించినట్లు తెలుస్తోంది. ఇంటర్నేషనల్ క్రికెట్లో అరంగేట్రం చేసిన ప్లేయర్లు , సెంట్రల్ కాంట్రాక్టులో ఉన్న అమ్మాయిలు రూ. 30 లక్షలు, రూ. 40 లక్షలు, రూ. 50 లక్షల కనీస ధరల్లో పేర్లు నమోదు చేసుకోవచ్చు. అరంగేట్రం చేయని క్రికెటర్లు రూ. 10 లక్షలు, రూ. 20 లక్షల విభాగాల్లో పేర్లు నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్లు సమాచారం. ఈ వేలంలో వివిధ రాష్ట్రాల్లోని మహిళా క్రికెటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని బీసీసీఐ ఆయా రాష్ట్ర క్రికెట్ సంఘాలకు సూచించింది.
ఫిబ్రవరిలో వేలం..?
మరోవైపు ఉమెన్స్ వేలం తేదీలు ఇంకా ఖరారు కాలేదు. అయితే బీసీసీఐ వర్గాల సమాచారం మేరకు ఫిబ్రవరి 11న వేలం ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వేలం తర్వాత మార్చి 6 నుంచి 26 వరకు ఉమెన్స్ ఐపీఎల్ నిర్వహిస్తారని సమాచారం. ఉమెన్స్ ఐపీఎల్ వేలంలో పేర్లు నమోదు చేసుకునే క్రికెటర్లు తమ వ్యక్తిగత స్పాన్సర్లను కూడా ధ్రువీకరించాల్సి ఉంటుంది.
మీడియా రైట్స్ కోసం పోటీ
అటు ఉమెన్స్ ఐపీఎల్ మీడియా హక్కుల కోసం పదికి పైగా కంపెనీలు టెండర్ పత్రాలను తీసుకున్నట్లు తెలుస్తోంది. డిస్నీ స్టార్, సోనీ నెట్వర్క్, వయాకామ్ 18,అమెజాన్ ప్రైమ్, ఫ్యాన్ కోడ్, టైమ్స్ ఇంటర్నెట్, గూగుల్, డిస్కవరీ సంస్థలు బ్రాడ్ కాస్టింగ్ రైట్స్ కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. ఈ మీడియా రైట్స్ టెండర్ పత్రాలు సమర్పించేందుకు జనవరి 12 చివరి తేదీ. అయితే బీసీసీఐ మాత్రం ఇంత వరకు.. మీడియా హక్కులకు కనీస ధర ప్రకటించలేదు. మీడియా హక్కుల వ్యవహారం కంప్లీట్ తర్వాతే ఫ్రాంచైజీలను విక్రయించాలని బీసీసీఐ చూస్తోంది. మహిళల ఐపీఎల్లో ప్రతి ఫ్రాంచైజీ రూ.1000 కోట్లకు పైగా ఆదాయం సృష్టిస్తాయని అంచనా వేశారు.
ఎన్ని జట్లు ఉంటాయంటే..!
ఉమెన్స్ ఐపీఎల్లో ప్రస్తుతం ఆరు జట్లు ఉంటాయని తెలుస్తోంది. ఇవి కూడా జోన్ల వారీగా ఉంటాయని సమాచారం. నార్త్ (ధర్మశాల/జమ్ము), సౌత్ (కోచి/వైజాగ్), సెంట్రల్ (ఇండోర్/రాయ్పుర్/నాగ్పుర్), ఈస్ట్ (రాంచీ/కటక్), నార్త్ ఈస్ట్ (గౌహతి), వెస్ట్ (పుణె/రాజ్కోట్) ప్రాతిపదికన జట్లను విక్రయించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ఐపీఎల్ జట్లే ఉమెన్స్ టీమ్స్ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు మహిళా ఫ్రాంచైజీలు తీసుకునేందుకు పోటీ పడుతామని ప్రకటించాయి.