
- డెంటల్ ఆసుప్రతిలో ప్రసవం
- తల్లి, బిడ్డను కాపాడిన డెంటల్ డాక్టర్లు
బెంగళూరు: లాక్డౌన్ కారణంగా హాస్పిటల్స్ అన్నీ మూసి ఉండటంతో కొన్ని చోట్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 7 కిలోమీటర్లు ప్రయాణించినా హాస్పిటల్స్ తెరిచి ఉండక పోవడంతో బెంగళూరులోని మహిళకు డెంటల్ డాక్టర్లు పురుడు పోశారు. కేసు కాంప్లికేట్ అయినప్పటికీ ట్రీట్మెంట్ చేసి తల్లి, బిడ్డను కాపాడారు. నార్త్ బెంగళూరుకు చెందిన ఒక కార్మికుడు నెలలు నిండిన తన భార్యకు నొప్పులు రావడంతో హాస్పిటల్కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. దాదాపు 7 కిలోమీటర్లు ప్రయాణం చేసినా ఒక్క హాస్పిటల్ కూడా తెరిచి ఉండకపోవడంతో చివరకు ఒక డెంటల్ హాస్పిటల్కు తీసుకెళ్లగా అక్కడి డాక్టర్లు ఆమెకు డెలివరీ చేశారు. పాప పుట్టినా ఆమెలో చలనం లేదు. అంతే కాకుండా తల్లికి కూడా తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో ఆమెకు చికిత్స అందించారు. అయితే అదృష్టవశాత్తు పాపలో కదలికలు వచ్చాయని, వారిని బెంగళూరులోని ప్రభుత్వం హాస్పిటల్కు తరలించామని డెంటల్ డాక్టర్ రమ్య చెప్పారు. “ లాక్డౌన్ కారణంగా దంపతులు దాదాపు 7 కిలోమీటర్లు నుంచి వచ్చారు. వారికి హాస్పిటల్స్ దొరకలేదు. దీంతో ఇక్కడకు రావడంతో చేసేదేమీ లేక ట్రీట్మెంట్ చేశాం. డెలివరీ అయిన తర్వాత పాపలో కదలికలు లేవు. తల్లికి కూడా తీవ్ర రక్తస్రావం అవుతోంది. దీంతో ఆమెను కాపాడాలని ట్రీట్మెంట్ చేస్తుండగా.. అదృష్టవశాత్తు పాపలో కదలికలు కనిపించాయి. ఇప్పుడు వాళ్లిద్దరూ క్షేమంగా ఉన్నారు” అని రమ్య అన్నారు.