ట్రాఫిక్ లో చిక్కుకున్నా.. పరుగెత్తుకెళ్లి మరీ సర్జరీ చేసిండు

ట్రాఫిక్ లో చిక్కుకున్నా.. పరుగెత్తుకెళ్లి మరీ సర్జరీ చేసిండు

బెంగళూరు నగరం ట్రాఫిక్‌కు పెట్టింది పేరు. అక్కడ తక్కువ దూరం ప్రయాణించడానికి సైతం చాలా సమయమే పడుతుంది. అయితే తన రోగి ప్రాణాలను కాపాడేందుకు ఓ డాక్టర్ తీసుకున్న ఓ నిర్ణయం అందరికీ ఓ స్ఫూర్తిదాయకమైన కథగా నిలుస్తోంది. మణిపాల్ హాస్పిటల్స్‌లో గ్యాస్ట్రోఎంటరాలజీ సర్జన్ గా డాక్టర్ గోవింద్ నందకుమార్ విధులు నిర్వహిస్తు్న్నారు. ఆగస్టు 30న అత్యవసర లాపరోస్కోపిక్ పిత్తాశయ శస్త్రచికిత్స చేసేందుకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సర్జాపూర్-మారాతల్లి మార్గంలో ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న డాక్టర్ గోవింద్ నందకుమార్.. ఆలస్యమైతే రోగి ప్రాణానికి అపాయమని గ్రహించారు. అనుకున్నదే తడవుగా ఆ ట్రాఫిక్ లోనే తన కారును వదిలి మూడు కిలోమీటర్లు పరిగెత్తి మరీ కీలకమైన శస్త్ర చికిత్స చేశారు. 

తాను ప్రతిరోజు సెంట్రల్ బెంగుళూరు నుండి బెంగుళూరుకు దగ్గర్లో ఉన్న మణిపాల్ హాస్పిటల్స్, సర్జాపూర్‌కి ప్రయాణిస్తానని డాక్టర్ గోవింద్ నందకుమార్ తెలిపారు. తాను సర్జరీకి చేసేందుకు సమయానికి ఇంటి నుండి బయలుదేరినా...ట్రాఫిక్ వల్ల తీవ్ర ఆగిపోవల్సి వచ్చిందని చెప్పారు. అయినా తాను శస్త్రచికిత్స చేయడానికి సిద్ధమయ్యానని... ఆ రద్దీలో, కారు డ్రైవర్‌తో సహా వదిలేయాలని నిర్ణయించుకున్నాని తెలిపారు. మరోమారు ఆలోచించకుండా హాస్పిటల్ వైపు పరుగెత్తానన్నారు. అప్పటికే పేషెంట్‌కి అనస్థీషియా వేయడానికి సిద్ధంగా ఉన్న  వైద్య బృందం.. తాను రాగానే ఆపరేషన్ ను మొదలుపెట్టామని చెప్పారు. ఫైనల్ గా డాక్టర్ తీసుకున్న నిర్ణయం ఓ మంచి ఫలితాన్నిచ్చింది. శస్త్రచికిత్స విజయవంతమవడంతో పాటు, రోగిని సమయానికి డిశ్చార్జ్ కూడా చేశారు. ఈ ఘటనపై నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ గోవింద్ నందకుమార్ చేసిన పనిపై ప్రశంసలు గుప్పిస్తున్నారు.