బెంగళూరు వేదికగా జీ20 ఫైనాన్స్ ట్రాక్ సమావేశం

బెంగళూరు వేదికగా జీ20 ఫైనాన్స్ ట్రాక్ సమావేశం

జీ20 ప్రెసిడెన్సీలో జీ20 ఫైనాన్స్ ట్రాక్ మొదటి సమావేశం బెంగళూరులో జరగనుంది. ఈనెల 13, 15 తేదీల్లో జీ20 ఫైనాన్స్, సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం బెంగళూరులో జరగనుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి అజయ్ సేథ్ తెలిపారు. ఈ సమావేశానికి జీ20 సభ్యులతో పాటు, అనేక ఇతర దేశాలకు చెందిన నేతలు, అంతర్జాతీయ సంస్థలను సమావేశానికి ఆహ్వానించామని చెప్పారు. భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న సమయంలో... ఈ ప్రధాన ప్రపంచ ఆర్థిక సమూహానికి ఒక సంవత్సరం పాటు అధికారంలో ఉండే అవకాశం వచ్చిందని అజయ్ సేథ్ అన్నారు. 

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ భారతదేశ జీ20 ప్రెసిడెన్సీలో ఫైనాన్స్ ట్రాక్‌కు నాయకత్వం వహించనున్నారు. ఇక ఫిబ్రవరి నెలలో బెంగళూరులో జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశాన్ని ప్లాన్ చేస్తున్నట్లు అజయ్ సేథ్ తెలిపారు. సమకాలీన సమస్యలపై విస్తృత చర్చలు జరపబోతున్నామని అన్నారు. వీటిలో ప్రపంచ స్థూల ఆర్థిక సమస్యలు, అంతర్జాతీయ ఆర్థిక నిర్మాణాన్ని బలోపేతం చేయడం, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్, హెల్త్ ఫైనాన్సింగ్, సస్టైనబుల్ ఫైనాన్స్, అంతర్జాతీయ పన్నుల వంటి ఆర్థిక రంగ సమస్యలు పై చర్చించబోతున్నామని ఆయన తెలిపారు. దాదాపు 40 సమావేశాలు, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ వర్కింగ్ గ్రూపులు, 4 మంత్రుల స్థాయి సమావేశాలను కవర్ చేస్తూ, ప్రపంచ ఆర్థిక చర్చకు గణనీయమైన విలువను జోడించేందుకు ప్రయత్నిస్తున్నామని అజయ్ సేథ్ వెల్లడించారు. అత్యంత కీలకమైన ఈ సమావేశానికి ఆతిథ్యమిచ్చినందుకు బెంగళూరు నగరంతో పాటు.. కర్ణాటక రాష్ట్రానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన చెప్పారు.