- హెల్మెట్ లేదని ఫైన్ కట్టమంటే.. డబ్బుల్లేక మంగళసూత్రం తీసిచ్చింది
- బెంగళూరులో ఘటన.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
బెంగళూరు: బజారులో ఓ మంచం తెచ్చుకుందామ ని వెళ్లిన భార్యాభర్తలను ట్రాఫిక్ పోలీసులు ఆపేసిన్రు.. హెల్మెట్ లేకుండా బండి నడిపినందుకు ఫైన్ కట్టాలని చలాన్ రాసిన్రు. ఎంత బతిలాడినా ట్రాఫిక్ పోలీసులు వినకపోవడంతో చివరకు ఆ మహిళ తన మెడలోని మంగళసూత్రం తీసిచ్చింది. కర్నాటక రాజధాని బెంగళూరులో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. సిటీకి చెందిన భారతి విభూతి శనివారం భర్తతో కలిసి మార్కెట్కు వెళ్లింది. ఇంట్లో కి ఓ మంచం కొనాలని రూ.1800 తీసుకుని భార్యాభర్తలు ఇద్దరూ బైక్పై వెళ్లారు. ఓ దుకాణంలో రూ.1700 పెట్టి మంచం కొన్నరు, మిగిలిన వందతో హోటల్లో టిఫిన్ చేశారు. తర్వాత మంచం తీసుకుని ఇంటికి బయల్దేరారు. మధ్యలో వీళ్లను ట్రాఫిక్ పోలీస్ ఆపేసిండు. హెల్మెట్ పెట్టుకోలేదని రూ.500 ఫైన్ వేసిండు. తెచ్చుకున్న డబ్బు మంచం కొనడానికే సరిపోయిందని, తమను వదిలిపెట్టాలని భారతి చాలాసేపు బతిలాడింది. అయినా ట్రాఫిక్ సిబ్బంది వినలే.. డబ్బు కట్టి వెళ్లాలని పట్టుబట్టిన్రు. దీంతో విసిగిపోయిన భారతి తన మెడలోని మంగళసూత్రం తీసిచ్చి, దానిని అమ్మి ఫైన్ వసూలు చేసుకొమ్మని చెప్పింది. ఈ తతంగమంతా 2 గంటల పాటు సాగింది. ఆ దారినపోయేటోళ్లంతా అక్కడ గుమికూడిన్రు. ఎవరో దీన్నంతా వీడియో తీసి సోషల్మీడియాలో పెట్టడంతో అది వైరల్గా మారింది. ఇదంతా జరుగుతుండగా అదే తోవలో వెళుతున్న పోలీస్ ఉన్నతాధికారి ఒకరు అక్కడ ఆగి, విషయం తెలుసుకున్నరు. భారతి మంగళసూత్రం ఆమెకు తిరిగిచ్చేసి, వాళ్లను ఇంటికి పంపించారు.