కర్ణాటకలోని చామరాజనగర్కు చెందిన బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి వీ శ్రీనివాస ప్రసాద్ ఆదివారం రాత్రి బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నాలుగు రోజులుగా ఐసియూలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయస్సు 76 సంవత్సరాలు. శ్రీనివాస ప్రసాద్ కు భార్య భాగ్యలక్ష్మి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ప్రజాసేవలో దాదాపు ఐదు దశాబ్దాల పాటు సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగించిన ఆయన 2024 మార్చి 18న రాజకీయాల నుండి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
1947 జూలై 6న మైసూరులో వెంకటయ్య, పుట్టమ్మ దంపతులకు జన్మించిన శ్రీనివాస ప్రసాద్ 1974లో ఇండిపెండెంట్గా కృష్ణంరాజు అసెంబ్లీ సెగ్మెంట్కు జరిగిన ఉప ఎన్నికలో గెలిచి రాజకీయాల్లోకి వచ్చారు. 14 ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఎనిమిదింటిలో విజయం సాధించారు. శ్రీనివాస ప్రసాద్ 1999 నుండి 2004 వరకు అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి 2013లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
సిద్ధరామయ్య ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. 2016లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి మళ్లీ బీజేపీలో చేరారు. 2017లో నంజన్గూడు ఉప ఎన్నికల్లో బీజేపీ టికెట్పై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2019లో చామరాజనగర్ నుంచి లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. సీఎం సిద్ధరామయ్య, మాజీ సీఎం బిఎస్ యడ్యూరప్పతో సహా కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు.