హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాశ్ రెడ్డి బీఆర్ఎస్కు గురువారం రాజీనామా చేశారు. తన రిజైన్ లేఖను కేసీఆర్కు పంపారు. తన మీద ఎలాంటి మచ్చ లేకున్నా పార్టీలో కొత్తగా చేరిన బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేశారని, అలాగే, పార్టీలో చర్చించకుండా మల్కాజ్గిరి ఎంపీ టికెట్ అవకాశవాది అయిన రాగిడి లక్ష్మారెడ్డికి ఇచ్చారని ఆయన తప్పుబట్టారు.
అవకాశవాది లక్ష్మారెడ్డి కంటే ఉద్యమ సహచరుడు అయిన ఈటల రాజేందర్ను గెలిపించుకోవాలనుకుంటున్నానని చెప్పారు. అందుకే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని లేఖలో ఆయన పేర్కొన్నారు. కాగా, గురువారం ఉదయం కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, కిషన్ రెడ్డి సమక్షంలో బేతి సుభాశ్ రెడ్డి, ఆయన భార్య, మాజీ కార్పొరేటర్ బేతి స్వప్న బీజేపీలో చేరారు.