గుజరాత్లో బీజేపీది గెలుపు కాదు : భట్టి

గుజరాత్లో బీజేపీది గెలుపు కాదు : భట్టి

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. హిమాచల్ ప్రదేశ్ లో తమ పార్టీ గెలిచేందుకు కృషి చేసిన కాంగ్రెస్ నేతలకు, క్యాడర్ కు భట్టి విక్రమార్క ధన్యవాదాలు తెలిపారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రెండూ బీజేపీ పాలిత రాష్ట్రాలని వెల్లడించారు. గుజరాత్ లో బీజేపీది గెలుపు కాదని.. స్థాయిని మరిచి మోడీ ప్రచారం చేశారని ఆరోపించారు. గుజరాత్ వ్యాపారులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మోడీ చెప్పి అక్కడ గెలిచారని అన్నారు. 

దేశ సంపద గుజరాత్ చేతుల్లో ఉందని మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. డబ్బు, అధికార దుర్వినియోగంతో మాత్రమే బీజేపీ వాళ్లు గెలిచారన్నారు. ఎంఐఎం, ఆప్ పార్టీలను మోడీ వాడుకున్నారని ఆరోపించారు.  ఎంఐఎం, ఆప్ పార్టీలు బీజేపీ ట్రాప్ లో పడ్డాయన్నారు. గుజరాత్ లో బీజేపీ, ఆప్ మధ్యే పోటీ అని ప్రచారం చేసుకుని.. లౌకిక వాద ఓట్లన్నీ చీల్చి వాళ్లు బయటపడ్డారని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ లో ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ పార్టే గెలిచిందన్నారు. ప్రధాని హోదాలో ఉన్న మోడీ.. తన స్థాయిని మరిచి ఎన్నికల ప్రచారం నిర్వహించారని ఆరోపించారు. 

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఎన్నో త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు.. భావోద్వేగాలతో లబ్ది పొందాలనుకోవడం సరికాదని.. గుజరాత్ లో బీజేపీ అలాగే గెలిచిందని ఆరోపించారు. సజ్జల కామెంట్స్ తెలంగాణ ఆకాంక్షలకు, ఆలోచనలకూ భిన్నంగా ఉన్నాయన్నారు. సజ్జల ఎన్ని కామెంట్స్ చేసినా ఉపయోగం లేదన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర ఎన్నికల కోసం కాదనే విషయాన్ని చాలాసార్లు చెప్పారని, దేశ ఐక్యత కోసమే చేస్తున్నారని భట్టి స్పష్టం చేశారు.