ఉత్తరప్రదేశ్లోని బిజ్నూర్ జిల్లాలో ఘటన
పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.. మధ్యాహ్నం 2 గంటలకు ముహూర్తం. పెళ్లి కూతురు పొద్దున్నే రెడీ అయింది. పెళ్లి కొడుకు కోసం వెయిటింగ్. 2.. 3.. 4.. 5.. సాయంత్రం 6.. 7 గంటలు దాటినా రాలే. హంగామా చేసుకుంటూ రాత్రికి ఎప్పుడో వచ్చారు పెళ్లి కొడుకు, బంధువులు. ‘గింత లేటుగా వస్తరా? పెళ్లి చేసుకోను.. పో’ అన్నది అమ్మాయి. పెద్దలు చెప్పినా వినలే. అతడి వెంట వెళ్లేదే లేదని తెగేసి చెప్పింది. అక్కడికక్కడే విడాకులిచ్చి.. ఊరిలోనే మరో అబ్బాయిని పెళ్లి చేసుకుంది..
అసలేమైందంటే..
అక్టోబర్లో ఉత్తరప్రదేశ్లోని బిజ్నూర్ జిల్లాలో సామూహిక పెళ్లిళ్లు జరిగాయి. అప్పుడు నంగల్జాట్ గ్రామానికి చెందిన అమ్మాయి, ధామ్పూర్కు చెందిన అబ్బాయి పెళ్లి చేసుకున్నారు. సంప్రదాయం ప్రకారం మరోసారి పెళ్లి చేయాలని రెండు ఫ్యామిలీలు భావించాయి. ఈనెల 4న మధ్యాహ్నం 2 గంటలకు పెద్దలు ముహూర్తం నిర్ణయించారు. పెళ్లికొడుకు బరాత్ రాత్రి చాలా లేట్గా వచ్చింది. ఎదురుచూసీ చూసీ కోపమొచ్చిందో ఏమో.. గొడవకు దిగారు అమ్మాయి తరఫు వాళ్లు. ‘మగ పెళ్లి వాళ్లం. లేటుగా వస్తం. గిప్పుడు ఏమైంది’ అన్నట్లుగా మాట్లాడారు అబ్బాయి బంధువులు. కట్నం గురించి కూడా ఏదో అన్నారు. ఇక చూస్కో పెళ్లికూతురు బంధువులు.. ‘వచ్చిందే లేటు. మళ్లా దబాయింపా?” అంటూ మీద పడిపోయారు. పెళ్లికొడుకును, ఫ్యామిలీని కొట్టారు. వారి వద్ద ఉన్న విలువైన వస్తువులన్నీ లాక్కుని, గదిలోకి వేసి తాళమేశారు. బిత్తరపోయిన పెళ్లి కొడుకు బంధువులు పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. పోలీసులు వచ్చి నాలుగు ‘మంచి మాటలు’ చెప్పి.. అందరినీ శాంతింపజేశారు. వాళ్లని కాంప్రమైజ్ చేశారు. కానీ ఇక్కడే ట్విస్ట్. పెళ్లికొడుకుతో వెళ్లేందుకు పెళ్లికూతురు ఒప్పుకోలే. ‘బరాత్కే లేటుగా వచ్చినోడు. నన్నేం చూసుకుంటాడు. అతడి వెంట నేను పోను’ అని మొండికేసింది. దీంతో వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నట్లుగా గ్రామ పెద్దలు ప్రకటించారు. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా పెళ్లికొడుకు తరఫు వారంతా వచ్చిన దారిలోనే వెళ్లిపోయారు. అమ్మాయికి నచ్చిన వ్యక్తితో పెళ్లి జరిపించారు ఊరి పెద్దలు.