V6 News

కాళేశ్వరం కేసులో కేసీఆర్ ను కాపాడుతున్నదే రేవంత్ రెడ్డి ..కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రక్షణ రాజకీయాలు : రాంచందర్ రావు

కాళేశ్వరం కేసులో కేసీఆర్ ను కాపాడుతున్నదే రేవంత్ రెడ్డి  ..కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రక్షణ రాజకీయాలు : రాంచందర్ రావు

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పరస్పర రక్షణ రాజకీయాలు నడుస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్​.రాంచందర్​రావు ఆరోపించారు. గతంలో ఓటుకు నోటు కేసులో రేవంత్‌‌‌‌ను కేసీఆర్ కాపాడితే.. ఇప్పుడు కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్‌‌‌‌ను రేవంత్ కాపాడుతున్నారని పేర్కొన్నారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో భారీ అవినీతి జరిగినా రేవంత్​సర్కారు ఇప్పటివరకు విచారణ ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్‌‌‌‌లో బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు.

బీఆర్​ఎస్​ హయాంలో జరిగిన లక్షల కోట్ల అప్పులు, మోటార్లకు మీటర్ల అంశంపై కేసీఆర్​ అబద్ధాలు చెబుతున్నారని.. దీనిపై తాము చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రజలు ఈ రెండు పార్టీల నాటకాలను గమనిస్తున్నారని, మార్పు కేవలం బీజేపీతోనే సాధ్యమని నమ్ముతున్నారని అభిప్రాయపడ్డారు. జగిత్యాలలో బీఆర్ఎస్, భూపాలపల్లిలో కాంగ్రెస్ సభల తీరు చూస్తుంటే.. బీజేపీ పెరుగుదలను చూసి ఆ రెండు పార్టీలు బెంబేలెత్తుతున్నాయనే విషయం అర్థమవుతోందన్నారు. 

23న ‘జన్ ఆక్రోష్ పాదయాత్ర’

మహిళా రిజర్వేషన్లను అటకెక్కించిన కాంగ్రెస్, ఇండియా కూటమి మహిళా వ్యతిరేక వైఖరిని ఎండగట్టేందుకు గురువారం(23న) హైదరాబాద్‌‌‌‌లో జన్‌ ఆక్రోష్‌ పాదయాత్ర నిర్వహించనున్నట్లు రాంచందర్ రావు తెలిపారు. ఈ యాత్ర జీహెచ్‌‌‌‌ఎంసీ ఆఫీస్ నుంచి ప్రారంభమై దోమల్‌‌‌‌గూడ మీదుగా ఇందిరా పార్క్ వరకు కొనసాగుతుందని చెప్పారు.