పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి

పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి

వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. మే 8వ తేదీ బుధవారం పార్టీ సీనియర్ నాయకుడు  గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని  పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ నిర్ణయించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగుతున్న తీన్మాన్ మల్లన్న ఇప్పటికే నామినేషన్ కూడా వేశారు. ఇక, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు.  మే 2 నుంచి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ మే 9 వరకూ కొనసాగనుంది. మే 13వ తేది వరకూ నామినేషన్ల ఉప సంహరణ గడువు ఉండగా, ఈ నెల 27న పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 5న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది.

కాగా, ఈ స్థానానికి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 2021 మార్చిలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2027 మార్చి వరకు పదవీకాలం ఉంది. అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ నుంచి జనగామ ఎమ్మెల్యేగా గెలవడంతో  ఎమ్మెల్సీ పదవికి  డిసెంబరు 9న రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఈసీ ఈ స్థానానికి ఆరు నెలల్లో ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. త్వరలోనే ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేయనుంది.