అక్రమ కేసులతో బీజేపీ గెలుపును అడ్డుకోలేరు

అక్రమ కేసులతో బీజేపీ గెలుపును అడ్డుకోలేరు

ఎన్నికల్లో గెలిచేందుకు సర్కార్ అన్ని వ్యవస్థలను వాడుకుంటోంది

సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది: రఘునందన్ రావు

సిద్దిపేట, వెలుగు: దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచేందుకు ప్రభుత్వం అన్ని వ్యవస్థలను వాడుకుంటోందని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని బీజేపీ క్యాండిడేట్ రఘునందన్ రావు ఆరోపించారు. ప్రభుత్వం అక్రమ కేసులతో బీజేపీ విజయాన్ని అడ్డుకోలేదని స్పష్టం చేశారు. మంగళవారం దుబ్బాకలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తూ పోలీసులు అడ్డుకుంటున్నారని, అధికారులు మంత్రి హరీశ్ రావుకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దుబ్బాకలో బీజేపీకి బలమే లేదన్న  హరీశ్ రావు మరి ఎందుకింత భయపడుతున్నారని ప్రశ్నించారు. అధికారుల తీరుపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యా దు చేస్తామన్నారు. పార్టీ కార్యకర్త వంశీకృష్ణ కారును ఒకేరోజు పలుసార్లు తనిఖీ చేశారని, ఒక్క రూపాయి దొరకలేదని చెప్పారు. కారులో డబ్బులు తీసుకెళ్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేపట్టామని చెబుతున్న పోలీసులు… తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. పోలీసుల తీరుపై సిద్దిపేట కమిషనర్ కు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర నిధులపై చర్చకు సిద్ధమా?

పింఛన్లు, కేసీఆర్ కిట్లలో కేంద్ర నిధులు లేవన్న మంత్రి హరీశ్ రావు.. దానిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని రఘునందన్ రావు సవాల్ విసిరారు. గత ఆరేండ్లలో సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల నియోజకవర్గాలకు ఎన్ని నిధులు వచ్చాయో? దుబ్బాకకు ఎన్ని నిధులు వచ్చాయో? వైట్ పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని బీజేపీ కార్యకర్తల మీద కేసులు నమో దు చేసిన పోలీసులు… హరీశ్ రావు బీజేపీ కార్యకర్తలను తిట్టినా ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండూ నాణేనికి బొమ్మబొరుసు లాంటివని ఎద్దేవా చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ఇన్ చార్జి  పాపారావు పాల్గొన్నారు.

For More News..

దుబ్బాకలో పోలీసుల హైడ్రామా.. కారులో డబ్బులున్నాయంటూ 9 గంటలపాటు స్టేషన్‌లోనే..

రైతులను సన్నొడ్లు వేయమంటివి.. నువ్వు దొడ్డొడ్లు వేస్తివి

కుండపోత వానలతో టెన్షన్​లో గ్రేటర్​ హైదరాబాద్​ జనం