కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తమ పార్టీ నేతలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు బీజేపీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి. బాలాజీ నగర్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు జ్యోతిని బెదిరించి బీఆర్ఎస్ లో చేర్చుకోవడంపై మండిపడ్డారు.
జీహెచ్ఎంసీ అధికారులతో నోటీసులిప్పించి తమ పార్టీ నేతలను ఎమ్మెల్యే మూడు రోజుల క్రితం బీఆర్ఎస్ లో చేర్చుకున్నారని ఆరోపించారు. పార్టీలో చేరిన మరుసటి రోజు నుంచి పార్టీ నుండి వస్తున్న ఒత్తిళ్లు భరించలేక మళ్లీ ఇవాళ బీజేపీలో చేరారని చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తాం, కబ్జా చేసిన వాటిలో ఇండ్లు కట్టిస్తామని హామీలిస్తూ ఎమ్మెల్యే పార్టీలో చేర్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ నేతల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అనుచరులు చేసిన భూ దందాలను త్వరలోనే బయటపెడ్తామని చెప్పారు.