ఎయిమ్స్‌లో చేరిన ఉమాభారతి

ఎయిమ్స్‌లో చేరిన ఉమాభారతి

బీజేపీ సీనియర్‌ నేత ఉమా భారతికి కరోనా సోకింది. దీనికి తోడు జ్వరం ఏమాత్రం తగ్గకపోగా, మరింత పెరగడంతో తప్పని పరిస్థితుల్లో రిషికేష్‌లోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరినట్టు ఆమె ట్వీట్ చేశారు. పరీక్షల తర్వాత డాక్టర్లు కనుక తనకు అనుమతి ఇస్తే రేపు(బుధవారం) బాబ్రీ మసీదు కూల్చివేత కేసు తీర్పు వెలువడనున్న సందర్భంగా లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు లోహాజరవుతానని తెలిపారు. నిజానికి తాను కోర్టుకు హాజరు కావాలన్న ఉద్దేశంతోనే ఆస్పత్రిలో చేరినట్టు తెలిపారు. తన ఆరోగ్యంపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఆందోళన చెందుతున్నట్టు తెలిపారు. తనకు రెండోసారి నిర్వహించిన పరీక్షల్లోనూ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు చెప్పారు.

ఇటీవల ఉమాభారతి కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత జ్వరం రావడంతో పరీక్షలు చేయించుకోగా కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.