ఫాంహౌస్ కేసు : కాసేపట్లో బీజేపీ పిటిషన్పై హైకోర్టు విచారణ

ఫాంహౌస్ కేసు : కాసేపట్లో బీజేపీ పిటిషన్పై హైకోర్టు విచారణ

ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి బీజేపీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారంటూ తమ పార్టీ ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ బీజేపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మునుగోడు  ఉప ఎన్నికల నేపధ్యంలో తమ పార్టీకి వస్తున్న ఆదరణ చూడలేక టీఆర్ఎస్ కుట్ర చేసిందని పిటిషన్లో పేర్కొంది. ఫాంహౌజ్ కేసును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జికి అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. శనివారం ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం 8 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. మునుగోడు ఉప ఎన్నిక ముగిసే వరకు ఫాం హౌస్ కేసులో పోలీసు దర్యాప్తుపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

మరోవైపు బీజేపీ పిటిషన్పై ప్రభుత్వం ఇవాళ కౌంటర్ దాఖలు చేయనుంది. ఫాంహౌస్ లో ఎమ్మెల్యేలు నిందితులకు మధ్య జరిగిన చర్చలకు సంబంధించి ఆడియో, వీడియో ఫుటేజీలను కోర్టుకు అప్పగించింది. జీవో నెంబర్ 51 ఆధారంగా రాష్ట్రంలోకి సీబీఐ అడుగుపెట్టేందుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్న విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.