కేసీఆర్ కుటుంబం దొంగ దందాలు చేస్తుంది:బండి సంజయ్

కేసీఆర్ కుటుంబం దొంగ దందాలు చేస్తుంది:బండి సంజయ్

రాష్ట్రంలో గ్రామాలకు వస్తున్న నిధులన్నీ కేంద్రం నుంచి వస్తున్నవే అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పేదలకు ఇండ్లు, మహిళలకు వడ్డీ లేని రుణాలు, సీసీ రోడ్లు కేంద్రమే వేయిస్తుందని చెప్పారు. కానీ కేసీఆర్ మాత్రం తాను అభివృద్ధి చేస్తున్నట్లుగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా నిర్మల్ జిల్లా ఓలా గ్రామంలో బండి సంజయ్ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు.

అప్పుల కుప్పగా మార్చారు..

తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ నాశనం చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ పేదలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు.  కేసీఆర్ రూ. 5 లక్షల కోట్ల అప్పు చేశారని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతీ వ్యక్తిపై రూ. లక్ష అప్పు ఉందన్నారు. ప్రధాని మోడీని తిట్టడం, శాపనార్థాలు పెట్టడం తప్ప కేసీఆర్ రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. తాగునీరు, ఇండ్లు, రోడ్లు ఏ హామీని కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. సంక్షేమ పథకాలను అమలు చేయడానికి కేసీఆర్ దగ్గర పైసలు లేవు కానీ...స్థలాలు, విదేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కేసీఆర్కు పైసలు ఉన్నాయని ఆరోపించారు. 

ఢిల్లీలో లిక్కర్ స్కాంలో కేసీఆర్ బిడ్డ కవిత పైసలు పెట్టిందని బండి సంజయ్ ఆరోపించారు. అందుకే  ఆమెపై ఈడీ కేసు పెట్టిందని చెప్పారు. కేసీఆర్ కుటుంబం దొంగ దందాలు చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రానికి ఏమీ చేయని కేసీఆర్ దేశాన్ని ఉద్దరిస్తడట అని ఎద్దేవా చేశారు.