పద్మారావునగర్, వెలుగు: మాదిగలు తమ భవిష్యత్, అభివృద్ధి, మనుగడకు వచ్చే పార్లమెంట్లు ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చి, అండగా నిలవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పరిధి సీతాఫల్ మండి బీదలబస్తీలో ఆదివారం రాత్రి ఎమ్మార్పీఎస్ సన్నాహక సమావేశం నిర్వహించగా.. ఆయన గెస్ట్ గా హాజరై మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు ఏర్పడిన ఎమ్మార్పీఎస్ 30 ఏండ్ల ఉద్యమం ఇప్పుడు ఆఖరిదశకు చేరుకుందని పేర్కొన్నారు. ఉద్యమానికి అండగా నిలిచిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మాదిగలు సపోర్టుగా ఉండాలని కోరారు.
ఎమ్మార్పీఎస్ కేవలం వర్గీకరణ సాధన కోసమే కాకుండా సమాజంలో అన్నివర్గాల సమస్యలపై ఉద్యమాలు చేసిందనేది గుర్తు చేశారు. మాజీ సీఎంలుగా చేసిన చంద్రబాబు, వైఎస్ఆర్, ప్రస్తుత సీఎం జగన్ తనకు ఎంపీ, ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి, మంత్రిని చేస్తానని చెప్పినా, జాతి ప్రయోజనాలకు పదవులను తాను వద్దని చెప్పానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ర్ట ఎమ్మార్పీఎస్ నేతలు, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.