2023లో రాష్ట్రంపై  కాషాయ జెండా: ఎంపీ అర్వింద్

2023లో రాష్ట్రంపై  కాషాయ జెండా: ఎంపీ అర్వింద్

హైదరాబాద్​, వెలుగు: ‘‘రాష్ట్రం  నుంచి నలుగురు బీజేపీ నేతలను ప్రజలు పార్లమెంటుకు పంపించారు. అందుకే 303  సీట్లు వచ్చాయి. లేదంటే 299 దగ్గరే ఆగిపోయేది, ఇది తెలంగాణ ప్రజల విజయమే.  రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం” అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్​ రావు అన్నారు. అవినీతికి చోటు లేని పార్టీ బీజేపీ అని, మచ్చ లేని నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు. అందుకే ప్రజలు మళ్లీ బీజేపీకే పట్టం కట్టారన్నారు. శనివారం హైదరాబాద్​ కూకట్​పల్లిలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో బాలాజీనగర్​ డివిజన్​ టీఆర్​ఎస్​ కార్పొరేటర్​ పన్నాల కావ్యా హరీశ్​రెడ్డి, ఆమె భర్త హరీశ్​ చంద్రారెడ్డిలు బీజేపీలో చేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్​ వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్​ఎస్​ కార్పొరేటర్​ బీజేపీలో చేరడంతో కూకట్​పల్లి నియోజకవర్గంలో బీజేపీ మరింత పటిష్టం అయిందని మురళీధర్​రావు అన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని, అందుకు నిజామాబాద్​లో కవిత ఓటమే నిదర్శనమని అన్నారు. దేశం కోసం సరిహద్దుల్లో సైనికులు రాత్రింబవళ్లు కాపలా కాస్తూ అమరులవుతుంటే కేసీఆర్​కు కనబడలేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిందని, బతుకమ్మ అంటే కవితమ్మ అన్నట్టు చేశారని, అంతకు ముందు బతుకమ్మ పండుగ లేదా అని ప్రశ్నించారు.  హైదరాబాద్​ రోడ్లపై ఒక్క గుంత చూపిస్తే దేనికైనా సిద్ధమన్న కేటీఆర్​.. ఒక్కసారి కూకట్​పల్లికి వచ్చి చూడాలి” అని ఆయన అన్నారు.

పరిపాలన, ప్రజా సంక్షేమాన్ని కేసీఆర్​ సర్కార్​ మరచిపోయిందని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ విమర్శించారు. కేంద్రం ఇస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తోందన్నారు. కమిషన్లు వచ్చే ప్రాజెక్టులపైనే ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘70 వేల టీఎంసీల నీళ్లలో సగం సముద్రం పాలవుతున్నదని కేసీఆర్​ అన్నారు. కాలం చెల్లిన నీటి విధానం మీద నడుస్తోందని ఆయన అన్నారు. మూడేళ్లు నిపుణులతో చర్చించి, అధ్యయనం చేసిన తర్వాత ప్రతి వర్షపు బొట్టును ఒడిసిపట్టే విధానం దగ్గర ఉందని, టైం వచ్చినప్పుడు చెప్తానని అన్న ఆయన.. వర్షపు నీటి వినియోగం, కరువు నివారణ అనే అంశంపై నిర్వహించిన నీతి ఆయోగ్​ సమావేశానికి ఎందుకు రాలేదు? ఇదేనా కేసీఆర్​ చిత్తశుద్ధి” అని అర్వింద్​ ప్రశ్నించారు. నిజమాబాద్​లో బీజేపీ జెండా ఎగురుతుందంటూ చాలా సార్లు చెప్పానని, అదే నిజమైందని అన్నారు. 2023లో రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని, మోడీ పాలన చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.