ఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్ తో ముడిపెట్టి.. దేశాన్ని శాశ్వతంగా పరిపాలించాలనే బీజేపీ కుట్రను భగ్నం చేశామన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. NDA ప్రభుత్వానికి ఇది చీకటి రోజు అని.. తొలిసారి ఓటమిని చవిచూసిందన్నారు ప్రియాంక గాంధీ. 2026, ఏప్రిల్ 18వ తేదీ ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఆమె మీడియాతో మాట్లాడారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచి.. శాశ్వతంగా పరిపాలించటానికే కేంద్రం రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకొచ్చిందన్నారామె. ఈ కుట్రను ప్రజాస్వామ్య ప్రతిపక్ష పార్టీలు అడ్డుకుని.. బీజేపీ కుట్రను చేధించామన్నారామె. కేంద్రంపై అంతర్జాతీయంగా తీవ్రమైన ఒత్తిడి ఉందని.. ఇప్పుడు ఆ విషయం స్పష్టంగా బయటపడిందని.. దేశ ప్రజలకు కూడా ఇది కనిపిస్తుందన్నారు ప్రియాంక గాంధీ.
2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయటానికి ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదని.. ఆ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తామని స్పష్టం చేశారామె. కొత్తగా నియోజకవర్గాల పునర్విభజన బిల్లుతో ముడిపెట్టి రాజ్యాంగ సవరణ చేయటం అనేది.. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలను బలహీన పరుస్తుందని ఆయా రాష్ట్రాల్లోని పార్టీలు స్పష్టంగా చెప్పారని.. బిల్లు ఓడిపోవటం అంటే ప్రజాస్వామ్యం విజయంగా అభివర్ణించారు ప్రియాంక గాంధీ.
మహిళా రిజర్వేషన్ బిల్లు స్వరూపాన్ని మార్చి.. ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చాలనే ప్రభుత్వం ప్రయత్నాలను సమర్థవంతంగా అడ్డుకోవటం అంటే.. ఇది దేశానికి.. రాజ్యాంగానికి.. ప్రతిపక్షాల ఐక్యతకు నిదర్శనం అన్నారు ప్రియాంక గాంధీ.
2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లను ఉపయోగించుకుని.. తమకు అనుకూలంగా నియోజకవర్గాలను మార్చాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని.. ఆ కుట్ర విఫలం అయ్యేసరికి మహిళా వ్యతిరేకి అనే ముద్ర వేయాలని ప్రయత్నం చేస్తుందన్నారు ప్రియాంక గాంధీ. ఇలాంటి వాటికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర దేశానికి ఉందని, అదే విధంగా కాంగ్రెస్ పార్టీకీ ఉందన్నారామె.

