రాజ్యసభ సభ్యుల్లో.. బీఆర్ఎస్ వాళ్ల ఆస్తులే ఎక్కువ

రాజ్యసభ సభ్యుల్లో..  బీఆర్ఎస్ వాళ్ల ఆస్తులే ఎక్కువ
  • రాజ్యసభ సభ్యుల్లో..  బీఆర్ఎస్ వాళ్ల ఆస్తులే ఎక్కువ
  • ఏడుగురి ఆస్తులు రూ.5,596 కోట్లు
  • ముగ్గురు ఎంపీల ఆస్తులు రూ.వంద కోట్లకు పైనే
  • మొత్తంగా టాప్‌‌లో పార్థసారథి రెడ్డి.. ఆస్తులు రూ.5,300 కోట్లు
  • రూ.2,577 కోట్లతో రెండో స్థానంలో ఏపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి
  • అతి తక్కువ ఆస్తులున్న ఎంపీగా ఆప్ నేత సంత్ బల్బీర్ సింగ్

హైదరాబాద్, వెలుగు: అత్యధిక ఆస్తులున్న రాజ్యసభ ఎంపీల జాబితాలో మన రాష్ట్రం నేతలే టాప్‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు. రాష్ట్రాలపరంగా చూసుకున్నా తెలంగాణే టాప్‌‌‌‌‌‌‌‌లో ఉంది. పార్టీల వారీగా చూస్తే బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ఉంది. ఏ పార్టీ ఎంపీలకూ లేనన్ని ఆస్తులు మన తెలంగాణ నేతలకే ఉన్నట్టు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) శుక్రవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది. మన రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఏడుగురు ఎంపీల ఆస్తుల విలువ రూ.5,596 కోట్లుగా ఏడీఆర్ రిపోర్ట్ వెల్లడించింది. ఆ ఏడుగురు ఎంపీలూ బీఆర్ఎస్ నేతలే కావడం గమనార్హం. హెటిరో డ్రగ్స్ అధినేత పార్థసారథి రెడ్డి రూ.5,300 కోట్ల ఆస్తులతో ఫస్ట్ ప్లేస్​లో ఉన్నారు. రాజ్యసభలోనే అత్యంత సంపన్నుడిగా ఆయన నిలిచారు. 

వంద కోట్లకు పైగా ఆస్తులున్న ఎంపీల జాబితాలో దివకొండ దామోదర్​రావు (రూ.124 కోట్లు), కేఆర్ సురేశ్​రెడ్డి (రూ.108 కోట్లు) ఉన్నారు. మిగతా నలుగురిలో వద్దిరాజు రవిచంద్ర వద్ద రూ.42 కోట్ల మేర ఆస్తులున్నట్టు రిపోర్ట్ వెల్లడించింది. జోగినపల్లి సంతోష్ కుమార్ ఆస్తి రూ.16 కోట్లు, కె.కేశవరావు సంపద రూ.2 కోట్లు, బడుగుల లింగయ్య యాదవ్ ఆస్తి రూ.కోటిగా పేర్కొన్నారు. పార్టీల పరంగా చూసినా రాజ్యసభలో కేవలం ఏడుగురు ఎంపీలే ఉన్న బీఆర్ఎస్ టాప్​లో నిలిచింది. మొత్తంగా బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుల సగటు ఆస్తుల విలువ రూ.799.46 కోట్లుగా రిపోర్ట్​లో వెల్లడైంది. బీఆర్ఎస్ ఎంపీల్లో ముగ్గురిపై క్రిమినల్​ కేసులున్నట్టు ఏడీఆర్ రిపోర్ట్ పేర్కొంది.

ఏపీ ఎంపీల ఆస్తులు రూ.3,591 కోట్లు

ఆస్తుల విషయంలో తెలంగాణ రాజ్యసభ ఎంపీలకు దరిదాపుల్లో ఏ రాష్ట్ర ఎంపీలు కూడా లేకపోవడం గమనార్హం. రాజ్యసభలో అత్యధిక ఆస్తులున్న సభ్యుల జాబితాలో ఏపీ నుంచి వైఎస్సార్​సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామి రెడ్డి రెండో స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ రూ.2,577 కోట్లు అని ఏడీఆర్ రిపోర్ట్​లో పేర్కొంది. ఏపీ నుంచి 11 మంది ఎంపీలు రాజ్యసభలో ఉండగా.. వారందరి ఆస్తుల విలువ రూ.3,823 కోట్లు. అందులో 9 మంది వైఎస్​ఆర్​సీపీ ఎంపీల ఆస్తుల విలువే రూ.3,561 కోట్లు కావడం గమనార్హం. ఆ రాష్ట్రంలో 11 మందిలో ఐదుగురు ఎంపీల ఆస్తులు రూ.వంద కోట్లకుపైనే ఉన్నట్టు నివేదిక స్పష్టం చేసింది. ఉత్తర్​ప్రదేశ్​లో 30 మంది ఎంపీల ఆస్తులు కలిపి రూ.1,941 కోట్లు. రాజ్యసభ సభ్యులకు అత్యధిక ఆస్తులున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ, ఏపీ తర్వాత యూపీ మూడో స్థానంలో నిలిచింది.

వీళ్లకు అతి తక్కువ ఆస్తులు

రూ.కోటి లోపు ఆస్తులున్న ఎంపీలు రాజ్యసభలో 31 మంది ఉన్నారు. రూ.3.79 లక్షలతో అతి తక్కువ ఆస్తులున్న ఎంపీగా సంత్ బల్బీర్ సింగ్ నిలిచారు. పంజాబ్ నుంచి ఆప్ ఎంపీగా ఆయన ఎన్నికయ్యారు. బల్బీర్ సింగ్ తర్వాత.. మహారాజ సనాజావోబా లైషెంబా (బీజేపీ, రూ.5.48 లక్షలు), సంజయ్ సింగ్ (ఆప్, రూ.6.6 లక్షలు), ప్రకాశ్ చిక్ బరాయిక్ (రూ.9.25 లక్షలు, తృణమూల్​కాంగ్రెస్​), సంకేత్ గోఖలే (రూ.10.23 లక్షలు, తృణమూల్ కాంగ్రెస్​) ఉన్నారు. సభలోని 85 మంది బీజేపీ ఎంపీల ఆస్తుల విలువ రూ.2,579 కోట్లు కాగా.. 30 మంది కాంగ్రెస్ ఎంపీల ఆస్తులు రూ.1,549 కోట్లుగా ఏడీఆర్ తన రిపోర్టులో​ వివరించింది.

33 శాతం మందిపై క్రిమినల్ కేసులు

ఏడీఆర్​ విశ్లేషించిన మొత్తం 225 మంది రాజ్యసభ ఎంపీల్లో 75 (33 శాతం) మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు వెల్లడైంది. వీరిలో 41 మందిపై తీవ్రమైన కేసులు ఉన్నాయి. ఇద్దరిపై మర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంబంధిత కేసులు (ఐపీసీ సెక్షన్ 302) ఉన్నాయి. మహిళలపై చేసిన నేరాలకు సంబంధించిన కేసులు నలుగురు ఎంపీలపై ఉన్నాయి. ఇందులో రాజస్థాన్‌‌‌‌‌‌‌‌కు చెందిన కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్‌‌‌‌‌‌‌‌పై అత్యాచారం సంబంధిత (ఐపీసీ సెక్షన్ 376) కేసు ఉంది. బీజేపీకి చెందిన 85 మంది ఎంపీల్లో 23 మందిపై, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు చెందిన 30 మంది ఎంపీల్లో 12 మందిపై, తృణముల్ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు చెందిన 13 మంది ఎంపీల్లో నలుగురిపై, ఆర్జేడీకి చెందిన ఆరుగురు ఎంపీల్లో ఐదుగురిపై, సీపీఎంకి చెందిన ఐదుగురు ఎంపీల్లో నలుగురిపై, 10 మంది ఆప్‌‌‌‌‌‌‌‌ ఎంపీల్లో ముగ్గురిపై, 9 మంది వైసీపీ ఎంపీల్లో ముగ్గురిపై, ఎన్సీపీకి చెందిన ముగ్గురు ఎంపీల్లో ఇద్దరిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. తమపై కేసులు ఉన్నట్లు సదరు నేతలే తమ అఫిడవిట్లలో పేర్కొన్నారు.