
బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. బీఆర్ఎస్ కు రాజీనామా చేసినట్లు ఆ పార్టీ సీనియర్ నాయకులు పీఎల్ శ్రీనివాస్ ప్రకటించారు. జనవరి 21వ తేదీ ఆదివారం ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీని వీడేందుకు గల కారణాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ పార్టీని దేవుడు కూడా రక్షించలేడు అంటూ మండిపడ్డారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన నాయకుల పట్ల అధిష్టానం తీరు తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీని ప్రజలు తిరస్కరించినా పార్టీ నాయకులలో మాత్రం ఆత్మ పరిశీల లేదని విమర్శించారు.
పార్టీని నడిపే అగ్ర నాయకులు కూడా పార్టీ ఓటమి ప్రజలు చేసిన తప్పు అని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఆత్మవంచన చేసుకొని బీఆర్ఎస్ లో ఉండలేక పార్టీకి రాజీనామా చేసినట్లు చెప్పారు. ప్రపంచ స్థాయి ప్రాజెక్టు అని ప్రచారం చేస్తూ కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం పార్టీకి పెద్ద దెబ్బ అని అన్నారు. అవినీతి అక్రమాల కారణంగానే ప్రాజెక్టు కుంగిందని ప్రతిపక్షాలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాయని అన్నారు. ఇలా పార్టీ వీడటానికి 100 కారణాలు ఉన్నాయని ఇక భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు ఆ పార్టీని ఆదరించే పరిస్థితి లేనేలేదని చెప్పారు. ఈ నేపథ్యంలోనే పార్టీ నుంచి బయటికి వచ్చానని శ్రేయోభిలాషులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని శ్రీనివాస్ తెలిపారు.