
బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం వేస్తున్న అడుగులకు సంబంధించి.. ఏపీ ప్రభుత్వ వైఖరి.. ఏపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై చర్చించటానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్షం సమావేశం జరిగింది. ఈ భేటీకి హాజరైన బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు.. మధ్యలోనే సమావేశం నుంచి వెళ్లిపోయారు. వాకౌట్ చేస్తున్నట్లు ఆ పార్టీ ఎంపీ రవిచంద్ర ప్రకటించి.. బయటకు వెళ్లిపోయారు.
బనకచర్ల ప్రాజెక్ట్ అనేది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో.. అప్పటి సీఎం కేసీఆర్ చేసిన పని వల్లే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి అన్యాయం జరుగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పట్లో ఏపీ సీఎంగా ఉన్న జగన్, తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్.. హైదరాబాద్ ప్రగతిభవన్ వేదికగా చర్చలు జరిపారని గోదావరి నదిలో 3 వేల టీసీఎంల మిగులు జలాలు ఉన్నాయని, వాటిని శ్రీశైలం తరలించటానికి బనకచర్ల అనే ప్రతిపాదనను అప్పటి సీఎం కేసీఆర్ తీసుకొచ్చారంటూ మినిట్స్ సాక్ష్యంగా వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి.
అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయం వల్లే ఇప్పుడు తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ లెక్కలు, ఆధారాలు, మినిట్స్ తో సహా సీఎం రేవంత్ రెడ్డి వివరాలను అఖిలపక్షం ఎదుట వివరించారు. దీంతో బీఆర్ఎస్ ఎంపీలు ఖంగుతిన్నారు. అఖిలపక్షం సమావేశం నుంచి వాకౌట్ చేస్తున్న ప్రకటించి.. బనకచర్ల ప్రాజెక్టుపై అఖిలపక్షం సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.