మా తప్పు వల్లే ఓటమి.. ప్రతిదీ నోట్ చేసుకుంటున్నం: కేటీఆర్

మా తప్పు వల్లే ఓటమి.. ప్రతిదీ నోట్ చేసుకుంటున్నం: కేటీఆర్
  • ఇప్పుడు మీరు చెప్పిన ప్రతీది నోట్ చేసుకుంటం
  • అసెంబ్లీకి లేటే, మీటింగ్‌కూ ఆలస్యంగానే.. 
  • మాజీ ఎమ్మెల్యేకు కేటీఆర్ చురకలు

హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో తాము చేసిన కొన్ని తప్పిదాల​ వల్లే ఓడిపోయామని బీఆర్ఎస్​వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన వరంగల్ పార్లమెంట్‌ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి మాట్లాడుకునే అవకాశం రాలేదు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ సమావేశాలు నిర్వహిస్తున్నం. తల్లడిల్లి ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని పదేండ్ల పాటు చల్లగా కాపాడుకున్నం.. కొన్ని తప్పిదాల కారణంగా ఎన్నికల్లో ఓటమి చెందాం.. ఇప్పుడు తెలంగాణ మళ్లీ ఢిల్లీ నేతల చేతుల్లోకి వెళ్లింది.. మన తెలంగాణ మన చేతులోకి తెచ్చుకునే టైం ఆసన్నమైందన్నారు కేటీఆర్. 

రాబోయే పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు, ప్రజలు ఆలోచిస్తున్నరు..తెలంగాణ గళం, బలం ఢిల్లీలో వినపాడాలంటే మనం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాల్సిన అవసరం ఉన్నదన్నారు కేటీఆర్. 

సమీక్షా సమావేశంలో మీకు మాట్లాడే అవకాశం ఇస్తున్నం. మీరు చెప్పిన ప్రతీ అభిప్రాయం నోట్ చేసుకుంటం’ అని కేటీఆర్​తెలిపారు. అంతకుముందు మీటింగ్​కు లేట్​గా వచ్చిన మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌పై కేటీఆర్‌ సీరియస్​అయ్యారు. అసెంబ్లీకి లేటే, మీటింగ్‌కు కూడా ఆలస్యంగానే వస్తారా? అని చురకలు అంటించారు.