ఎల్లారెడ్డిగూడ పరిధిలో .. సాఫ్ట్ వేర్​ కోర్సుల ఫ్యాకల్టీ దారుణ హత్య

ఎల్లారెడ్డిగూడ పరిధిలో .. సాఫ్ట్ వేర్​ కోర్సుల ఫ్యాకల్టీ దారుణ హత్య
  • ఆనవాళ్లు దొరకకుండా కారం, పసుపు చల్లి పరారైన హంతకుడు

జూబ్లీహిల్స్, వెలుగు : సాఫ్ట్ వేర్​ కోర్సుల ఫ్యాకల్టీ దారుణహత్యకు గురైన సంఘటన మధురానగర్​పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఏపీలోని కృష్ణాజిల్లా తిరువూరు గంపల గూడెంకు చెందిన రవికుమార్​(45)కు భార్య అశ్వని, కూతురు ఉన్నారు. అతను కుటుంబంతో సిటీకి వచ్చి ఎల్లారెడ్డిగూడలోని ఫ్రిబ్జి రెసిడెన్సీలోని సెకండ్​ఫ్లోర్​లో ఉంటున్నాడు. రవికుమార్ సాఫ్ట్ వేర్ కోర్సుల ఫ్యాకల్టీగా ఆఫ్ లైన్, ఆన్ లైన్ క్లాసులు చెబుతుంటాడు. 

బుధవారం సాయంత్రం అతడు ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. భార్య, పాప వాకింగ్​కు వెళ్లారు. రవికుమార్​ఫ్లాట్ లోకి ఓ ఆగంతకుడు చొరబడి అతడి తలపై బలంగా కొట్టడడంతో స్పాట్ లో చనిపోయాడు. నిందితుడు ఆనవాళ్లు దొరకకుండా కారం, పసుపు చల్లి పరార్ అయ్యాడు. పంజాగుట్ట ఏసీపీ మోహన్​కుమార్​ఆధ్వర్యంలో క్లూస్​టీం వెళ్లి దర్యాప్తు చేపట్టింది. ముందస్తు ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్టు తెలుస్తుంది. ఫింగర్ ప్రింట్ నిపుణులు, పోలీసు అధికారులు సీసీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. నిందితుడి కోసం ఏసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్ లతో గాలింపు చేపట్టారు.