నిజాం విద్యార్థులకు మద్దతుగా రేపు బీఎస్పీ ఆందోళనలు

నిజాం విద్యార్థులకు మద్దతుగా రేపు బీఎస్పీ ఆందోళనలు

హైదరాబాద్: హాస్టల్ వసతి కోసం ఆందోళన చేస్తున్న నిజాం కాలేజీకి విద్యార్థులకు బహుజన సమాజ్ వాదీ పార్టీ మద్దతు ప్రకటించింది. నిజాం కాలేజీ విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావంగా రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన తెలుపుతామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. 

నిజాం కాలేజీలో డిగ్రీ విద్యార్థుల ఆందోళనలు ఇవాళ 14వ రోజు కూడా కొనసాగాయి. హాస్టల్ భవనాన్ని పూర్తిగా యూజీ విద్యార్థులకు మాత్రమే కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరసన కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కొత్తగా కట్టిన హాస్టల్ బిల్డింగ్ ను  సగం పీజీ విద్యార్థులకు, మిగిలిన సగం భవనాన్ని డిగ్రీ విద్యార్థులకు కేటాయిస్తూ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయగా.. విద్యాశాఖ నిర్ణయాన్ని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

నిర్ణయాన్ని విద్యాశాఖ వెనక్కి తీసుకోవాలంటూ విద్యార్థులు ఆందోళనలు మొదలుపెట్టి 14 రోజులుగా కొనసాగిస్తున్నారు. నిజాం కాలేజీ విద్యార్థులకు ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒకడుగు ముందుకేసి నిజాం కాలేజీ విద్యార్థుల ఆందోళనకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో నిరసనలకు పిలుపునిచ్చారు. విద్యార్థులు లేకుంటే తెలంగాణ ఉద్యమం లేదని.. ప్రత్యేక రాష్ట్ర సాధనలో విద్యార్థులు కీలక పాత్ర పోషించారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుర్తు చేశారు.