తెలంగాణలో రౌడీలా రాజ్యం నడుస్తుంది: రాకేష్ రెడ్డి

తెలంగాణలో రౌడీలా రాజ్యం నడుస్తుంది: రాకేష్ రెడ్డి

తెలంగాణాలో రౌడీలా రాజ్యం నడుస్తుందని ప్రముఖ పారిశ్రామికవేత్త పైడి రాకేష్ రెడ్డి ధ్వజమెత్తారు. జూన్ 1వ తేదీ గురువారం ఆయన తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ ఛుగ్ సమక్షంలో బీజేపీలో చేరారు. రాకేష్ రెడ్డికి కాషాయం ఖండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తరుణ్ ఛుగ్ తోపాలు ఎంపీ ధర్మపురి అరవింద్, పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. 

అనంతరం మాట్లాడిన రాకేష్ రెడ్డి.. భారత్ అంటేనే బీజేపీ అని.. విదేశాల్లోని ఇండియన్స్ అందరూ గర్వంగా భావిస్తున్నారని తెలిపారు. అమరవీరుల త్యాగాల తెలంగాణ ఇది కాదని.. తెలంగాణలో రౌడీలా రాజ్యం నడుస్తుందని రాకేష్ రెడ్డి ధ్వజమెత్తారు. మోడీ నాయకత్వం నచ్చే బీజేపీలో చేరానని స్పష్టం చేశారాయన. కార్యకర్తగా ఉంటూనే పార్టీ ఎలాంటి బాధ్యత ఇచ్చిన మోసేందుకు సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు.

తరుణ్ ఛుగ్ మాట్లాడుతూ.. స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డ, పారిశ్రామికవేత్త పైడి రాకేష్ రెడ్డి బీజేపీలో చేరారు. ఆయనకు స్వాగతం పలుకుతున్నా అన్నారు. తెలంగాణాలో గడిచిన 9 ఏళ్లలో కుటుంబ పాలనా, వంచన పాలనా, అవినీతి పాలనే నడిచింది.. కేసీఆర్ పాలనపై విసుగెత్తిన ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని వెల్లడించారు. కేసీఆర్ కోసమే కాంగ్రెస్ పనిచేస్తుందని తరుణ్ ఛుగ్ విమర్శించారు. కాంగ్రెస్ గుర్తుమీద గెలిచినవాళ్లు కేసీఆర్ పంచన చేరి అసెంబ్లీలో కూర్చుంటున్నారని ఆరోపించారు. ఢిల్లీలో కేసీఆర్, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నాడని వ్యాఖ్యానించారు. 

కేసీఆర్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నాడని..లోపాయికారి ఒప్పందంలో భాగంగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ అవినీతిపాలనాను మోడీ నేతృత్వంలో అంతమొందిస్తామన్నారు. తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుంది. నవంబర్ లో జరిగే ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మద్దతుతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తరుణ్ ఛుగ్ పేర్కొన్నారు. 

ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ.. కవిత నిజామాబాద్ నుంచే పోటీ చేయాలని..పారిపోయి మెదక్ వెళ్లొద్దని సూచించారు. మాజీ ఎంపీ, ఎమ్మెల్సీగా అక్కడ తిరగడం ఆమె బాధ్యత అన్నారు అరవింద్. కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేయించాలని చూస్తున్నాడని.. తాను తండ్రి మాట విననట్లేదు కవిత కూడా కేసీఆర్ మాట వినకుండా నిజామాబాద్ నుంచి పోటీ చేయాలని తెలిపారు. కల్వకుంట్ల కుటుంబం ఒక రోగం, దానికి విరుగుడు బీజేపీనే అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే అని.. ఎన్నికల్లో కోట్లడి, ఎన్నికలు ముగియగానే దోస్తీ కడుతారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్యాకేజీ కోసమే కాంగ్రెస్ నేతలు పనిచేస్తున్నారని అరవింద్ ఆరోపించారు. కాంగ్రెస్ లో గెలిచినోళ్లు బీఆర్ఎస్ లో చేరడం కొత్తేమి కాదని ఎద్దేవ చేశారు అరవింద్. తెలంగాణ ఫలితం బీజేపీకి అనుకూలంగా ఉంటుంది.. తెలంగాణ ప్రజలు మార్పుకు ఓటు వేస్తారన్నారు. కాంగ్రెస్ నేతలు చాలామంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అరవింద్ జోష్యం చెప్పారు.