ఎల్ బీనగర్, వెలుగు : ప్రజాదరణ చూసి ఓర్వలేకనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని నాగోల్ లో నిర్వహించిన గౌడ విద్యార్థి వసతి గృహం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై మీద కేసు నమోదైందని, అది చిన్న విషయమే అన్నారు. కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదన్నారు.
రంగారెడ్డి, పాలమూరు జిల్లాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే తనపై ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కుల వృత్తులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ఉందన్నారు. గౌడ్ల సంక్షేమ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. త్వరలో ట్యాంక్ బండ్పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా గౌడ్ కులస్తులు ఐకమత్యంగా ఉండి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.