పడిపోయిన కార్ల అమ్మకాలు

పడిపోయిన కార్ల అమ్మకాలు

దేశీయంగా కార్ల అమ్మకాలు గత రెండు నెలలుగా పడిపోయాయి. సేల్స్ లేక షోరూమ్స్ లో ఇన్వెంటరీలు నిండిపోయాయి. కొత్తగా కార్లను కూడా దిగుమతి చేసుకోవడం లేదు. ఇయర్ ఎండ్ సేల్స్  పెంచుకోవడానికి డిసెంబర్ లో ఆఫర్లు ప్రకటించిన కార్ల కంపెనీలు..సేల్స్ లేకపోవడంతో ఆఫర్లను జనవరి నెల మొత్తం కంటిన్యూ చేశాయి. కొత్త మోడళ్ల ఎంట్రీతో ఫిబ్రవరిలో కొంచెం సేల్స్ గాడిలో పడ్డా..మార్చిలో మళ్లీ పడిపోయాయి.

ప్రస్తుతం ఎలక్షన్ టైమ్ కావడంతో సేల్స్ తక్కువగా ఉన్నాయంటున్నారు షోరూమ్ నిర్వాహకులు. దీంతో పాటు కొత్త మోడళ్ల ఎంపికలో కస్టమర్లు జాప్యం చేస్తున్నారని చెబుతున్నారు. కొన్ని కంపెనీలు రేట్లు పెంచడంతో  కొందరు కార్లు కొనడానికి ఆసక్తి చూపించడం లేదంటున్నారు.

ఆటోమొబైల్ కంపెనీలు కార్ల రేట్లు పెంచుతున్నాయి. జనవరిలో మారుతీ సుజుకీ 2 శాతం రేట్లు పెంచింది. దీంతో వివిధ మోడళ్లపై పదివేల నుంచి 30 వేల వరకు ధరలు పెరిగాయి. మరోవైపు ఏప్రిల్ 1 నుంచి రేట్లను పెంచుతున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. దీంతో ఒక్కో కార్ పైన 25 వేల వరకు ధర పెరుగుతుంది. వీటితో పాటు మిగతా కార్ల కంపెనీలు కూడా త్వరలోనే రేట్లు పెంచుతున్నాయి. ప్రొడక్షన్ కాస్ట్ పెరగడమే రేట్లు పెరగడానికి కారణమని చెబుతున్నాయి.

గతేడాది ఫిబ్రవరిలో 2,34,632 ప్యాసింజర్ వెహికిల్స్ అమ్ముడుపోగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎనిమిది శాతం తగ్గి 2,15,276 వెహికిల్స్ అమ్ముడయ్యాయి. గతేడాది జనవరిలో 1,84,264 కార్లు అమ్ముడవ్వగా.. ఈ ఏడాది జనవరిలో 1,79,389 కార్లు మాత్రమే అమ్ముడయినట్లు సియామ్ డేటాలో వెల్లడైంది. ప్రస్తుతం డీలర్ల దగ్గర కార్ల నిల్వలు పెరిగిపోతున్నాయి. కొందరి దగ్గర అయితే మూడు నెలలకు సరిపోయే స్టాక్ ఉంది. రాబోయే రోజుల్లో కూడా అమ్మకాలు పెరగకపోతే డీలర్లు కొత్త స్టాక్ కోసం ఆర్డర్ చేయకపోవచ్చు. మార్కెట్లోకి వచ్చిన కొత్త మోడళ్లు సేల్స్ పెంచుతాయనే ఆశాభావంతో ఉన్నారు.