కామినేని హాస్పిటల్‌పై కేసు నమోదు

కామినేని హాస్పిటల్‌పై కేసు నమోదు

ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ వైద్యులు, మేనేజ్మెంట్ పై 304A సెక్షన్ కింద కేసు నమోదైంది. గత రెండు రోజుల క్రితం కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రవీందర్ అనే వ్యక్తి మృతి చెందిన ఘటనలో ఈ కేసు నమోదైంది. గత 13 రోజుల క్రితం హెర్నియా ఆపరేషన్ కోసం ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ లో చేరిన రవీందర్ అనే వ్యక్తికి చిన్న సర్జరీ చేయాలని చెప్పి జాయిన్ చేసుకుని చివరికి చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.  సర్జరీ సమయంలో మత్తుమందు డోస్ ఎక్కువ కావడంతో మత్తు మందు పడలేదని ఐసీయూలో వెంటిలేటర్ పై పెట్టాలని చెప్పి లక్షల రూపాయల డబ్బులు దండుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరికి చికిత్స పొందుతూ రవీందర్ మృతి చెందాడని, బాడీని తీసుకుని వెళ్ళాలని ఆస్పత్రి వర్గాలు చెప్పినట్లు మృతుని బంధువులు చెబుతున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే రవీందర్ చనిపోయాడని ఆరోపిస్తూ కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆపరేషన్ చేసిన డాక్టర్ కృష్ణా చౌదరితో పాటు ఆస్పత్రి మేనేజ్మెంట్ పై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కాగా నెల వ్యవధిలోనే ఇలాంటి ఘటన కామినేని ఆసుపత్రిలో జరగటం ఇది రెండోసారి కావడం గమనార్హం.