
- 30 ప్రాజెక్టులకు రూ.4,872 కోట్లు కేటాయించిన కేంద్రం
- ఆ నిధులతో రాష్ట్రంలో 311 కిలోమీటర్ల పనులు
- త్వరలో డీపీఆర్లకు టెండర్లు పిలవనున్న ఆఫీసర్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో హైవేల విస్తరణ, బైపాస్ రోడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.4,872 కోట్ల నిధులను కేటాయించింది. కేంద్ర ఉపరితల రవాణా శాఖ (మోర్త్) 2025–26 యాక్షన్ ప్లాన్లో భాగంగా రాష్ట్రానికి కేంద్రం ఈ నిధులు కేటాయించింది. ఈ ఫండ్స్తో రాష్ర్టంలో 311 కిలోమీటర్ల మేర రోడ్ల విస్తరణ చేపట్టనున్నారు. ఇందులో మూడు సిటీలకు బైపాస్ రోడ్లతో పాటు ఆర్ఓబీలు నిర్మించడం, 2 లేన్ల హైవేలను 4 లేన్లుగా విస్తరించడం వంటివి మొత్తం 30 ప్రాజెక్టులు ఉన్నాయి.
ఇటీవల మిజోరంలో అన్ని రాష్ర్టాల ఆర్ అండ్ బీ, మోర్త్ రీజనల్ ఆఫీసర్లతో జరిగిన మీటింగ్ లో ఏ రాష్ర్టానికి ఎన్ని నిధులు, ఎన్ని ప్రాజెక్టులు కేటాయించామో కేంద్రం ప్రకటించింది. ఈ ప్రాజెక్టులకు మోర్త్ త్వరలో డీపీఆర్ లకు టెండర్లు పిలవనుంది. మూడు నెలల్లో డీపీఆర్ లు వచ్చాక కేంద్రానికి రాష్ర్ట ప్రభుత్వం వాటిని పంపిస్తుంది. అప్పుడు కేంద్రం నిధులు విడుదల చేస్తుందని అధికారులు తెలిపారు.
అడిగింది రూ.17 వేల కోట్లు.. ఇచ్చింది రూ.4 వేల కోట్లే
రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో రోడ్ల విస్తరణ, రిపేర్లు, బైపాస్ రోడ్ల నిర్మాణానికి మొత్తం రూ.17,310.25 కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ర్ట సర్కారు విజ్ఞప్తి చేసింది. కానీ.. కేంద్రం రూ.4,872 కోట్ల నిధులే కేటాయించింది. అలాగే, 2025–26 ఏడాదికి యాక్షన్ ప్లాన్ రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ప్రభుత్వం అందించిన ప్రతిపాదనల్లో రోడ్ల విస్తరణ, బైపాస్ రోడ్లు, ఆర్ యూబీలు, రోడ్ సేఫ్టీ వర్క్ లు వంటివి ఉన్నాయి.
కేంద్రం శాంక్షన్ చేసిన ప్రాజెక్టులు
- మహబూబ్ నగర్ బైపాస్ (11 కి.మీ) కు రూ.550 కోట్లు
- హుజూర్ నగర్ బైపాస్ (7 కి.మీ) కు రూ.180 కోట్లు
- భూపాలపల్లి బైపాస్ (22 కి.మీ) కు రూ.500 కోట్లు
- ఖానాపూర్ బైపాస్, చెలగల్ హైవే విస్తరణ 2 లేన్ల విస్తరణ (54 కి.మీ) కు రూ.750 కోట్లు
- దుద్దెడ నుంచి సిరిసిల్ల 2 లేన్ల నుంచి 4 లేన్ల విస్తరణ (54 కి.మీ) కు రూ.1,150 కోట్లు
- మద్నూర్, బోధన్ హైవే విస్తరణ (39 కి.మీ) రూ.634 కోట్లు
- హైదరాబాద్, భూపాలపల్లి హైవేలో బ్రిడ్జి నిర్మాణం (1 కి.మీ) కు రూ.150 కోట్లు
- హైదరాబాద్, శ్రీశైలం హైవే విస్తరణ (6 కి.మీ) కు రూ.100 కోట్లు
- హైదరాబాద్, భూపాలపల్లి హైవే విస్తరణ (35 కిమీ) కు రూ. 270 కోట్లు