రాజకీయ సమావేశాల నిర్వహణకు గ్రీన్ సిగ్నలిచ్చిన కేంద్ర ప్రభుత్వం

రాజకీయ సమావేశాల నిర్వహణకు గ్రీన్ సిగ్నలిచ్చిన కేంద్ర ప్రభుత్వం

రాజకీయ సమావేశాలకు కేంద్ర ప్రభుత్వం వెలుసుబాటు కల్పించింది. బీహార్‌  అసెంబ్లీ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఒక లోక్‌సభ, 56 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో నిర్వహించుకునే రాజకీయా సభలు, సమావేశాలకు 50 శాతం మందికి అనుమతిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కరోనా లాక్‌డౌన్‌ క్రమంలో సెప్టెంబర్‌ 30న కేంద్రం ‘అన్‌లాక్‌ 5.0’ నిబంధనలు విడుదల చేసింది. అందులో సభలు, సమావేశాలు నిర్వహించుకుంటే 100 మందికి మించకూడదని తెలిపింది. ఈ నిబంధన కూడా ఈ నెల 15 నుంచి అమల్లోకి వస్తుంది.

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగనున్న సందర్భంగా ఈ నిబంధనను సవరిస్తూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజరు కుమార్‌ భల్లా ఉత్తర్వులు జారీ చేశారు. తాజా ఉత్తర్వుల ప్రకారం.. హాళ్లు, ఆడిటోరియాల్లో జరిగే సభలు, సమావేశాల్లో ఆయా హాళ్ల సామర్థ్యాన్ని బట్టి 50 శాతం మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. గరిష్టంగా 200 మంది పాల్గొనవచ్చు. బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే సభలు, సమావేశాల్లోనూ ప్రదేశాల సామర్థ్యాన్ని బట్టి 50 శాతం మందికి మించకూడదు. అయితే సమావేశాల్లో పాల్గొనే వారు కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని చెప్పారు. వారికి థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయడం, శానిటైజర్లు అందుబాటులో ఉంచడం. భౌతికదూరం, మాస్కులు ధరించడం వంటి రూల్స్ పాటించాలి.