టీకా వేస్ట్​ చేస్తే రాష్ట్రాల కోటాలో కోత

టీకా వేస్ట్​ చేస్తే  రాష్ట్రాల కోటాలో కోత
  • జనాభా, కేసుల సంఖ్యను బట్టి రాష్ట్రాలకు కేటాయింపు
  • కొత్త గైడ్​లైన్స్​ను విడుదల చేసిన కేంద్రం
  • పేదలకు ప్రైవేట్​లోనూ ఫ్రీగా ఇచ్చేందుకు ఈ–ఓచర్లు
  • ఆన్​లైన్​, ఆఫ్​లైన్​ రిజిస్ట్రేషన్లకు అనుమతి

న్యూఢిల్లీ: రాష్ట్రాల జనాభా, అక్కడ కరోనా కేసుల సంఖ్య (మహమ్మారి తీవ్రత)ను బట్టి కరోనా వ్యాక్సిన్లను కేటాయిస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. టీకాలను ఎక్కువగా వృథా చేస్తే రాష్ట్రాల కోటాలో కోత పెడతామని హెచ్చరించింది. రాష్ట్రాలకు కరోనా టీకాల కేటాయింపులపై మంగళవారం కేంద్ర ప్రభుత్వం కొత్త గైడ్​లైన్స్​ను విడుదల చేసింది. కొత్త గైడ్​లైన్స్​ ఈ నెల 21 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. సంస్థలు తయారు చేసే వ్యాక్సిన్​ డోసుల్లో 75 శాతం కేంద్రమే కొంటుందని, మిగతా 25 శాతం డోసులను ప్రైవేట్​ ఆస్పత్రులకు కంపెనీలు అమ్ముకోవచ్చని స్పష్టం చేసింది. 

పేదోళ్లు ప్రైవేట్​లోనూ ఫ్రీగా టీకా పొందేందుకు కేంద్రం అవకాశం ఇచ్చింది. అందుకోసం రిజర్వ్​ బ్యాంక్​ ఆమోదించిన ఈ–ఓచర్లను అందించనుంది. ‘లోక కల్యాణం’ స్ఫూర్తిని చాటేలా పేద, పెద్ద తేడా లేకుండా అందరికీ సమానంగా టీకాలు అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది. డిమాండ్​ను బట్టి ప్రైవేట్​ ఆస్పత్రులకూ కేంద్రమే ఈ వ్యాక్సిన్లను సరఫరా చేస్తుందని, నేషనల్​ హెల్త్​ అథారిటీ ఎలక్ట్రానిక్​ ప్లాట్​ఫాం ద్వారా చెల్లింపులు చేస్తుందని తెలిపింది. దీని వల్ల మారుమూల ప్రాంతాల్లోని చిన్న, పెద్ద ప్రైవేట్​ ఆస్పత్రులకూ ఎక్కువ సంఖ్యలో వ్యాక్సిన్లను అందించేందుకు వీలవుతుందని చెప్పింది. ప్రైవేటు ఆస్పత్రులకు టీకా ధరలను కంపెనీలే నిర్ణయిస్తాయని తెలిపింది. అందరికీ ఉచితంగానే వ్యాక్సిన్​ వేస్తున్నా.. ఈ నిర్ణయం వల్ల డబ్బున్నోళ్లు ప్రైవేట్​లో వ్యాక్సిన్​ వేయించుకోవచ్చని పేర్కొంది. 

ఎవరికి వేయాలన్నది రాష్ట్రాల ఇష్టం

ప్రస్తుతం 18 ఏండ్లు దాటినోళ్లందరికీ వ్యాక్సిన్​ వేయొచ్చని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. అయితే, ప్రాధాన్య క్రమంలో టీకా ఎవరికి వేయాలో రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవచ్చని తాజా గైడ్​లైన్స్​లో కేంద్రం పేర్కొంది. టీకాల లభ్యత, వ్యాక్సినేషన్​ షెడ్యూల్​ను బట్టి నిర్ణయించుకోవచ్చంది. టీకాల కోసం కొవిన్​ సైట్​ లేదా యాప్​లో రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చని.. ఆ సౌకర్యం లేని వాళ్లు టీకా కేంద్రాల వద్ద ఆఫ్​లైన్​లో రిజిస్ట్రేషన్​ చేసుకునే అవకాశాన్ని ఇచ్చింది. 

44 కోట్ల డోసులకు ఆర్డర్​

ఈ నెల 21 నుంచి 18 ఏండ్లు దాటినోళ్లందరికీ ఉచితంగా టీకాలు వేస్తామని ప్రకటించిన మర్నాడే.. కేంద్రం 44 కోట్ల డోసులకు ఆర్డర్​ పెట్టింది. 25 కోట్ల కొవిషీల్డ్​ టీకా డోసులు, 19 కోట్ల కొవాగ్జిన్​ డోసులకు ఆర్డరిచ్చినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. టీకాల సరఫరా కోసం సీరమ్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా, భారత్​ బయోటెక్​లకు 30 శాతం అడ్వాన్స్​ కూడా ఇచ్చామని వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి డిసెంబర్​ మధ్య కంపెనీలు టీకా డోసులను ఇస్తాయని పేర్కొంది.