
కేంద్ర ప్రభుత్వం వీసా నిబంధనలను సడలించింది. అన్ని వర్గాల విదేశీయులు భారత్లోకి ప్రవేశించేందుకు ఇవాల(గురువారం) అనుమతి ఇచ్చింది. అయితే పర్యాటకం కోసం భారత్లో విజిట్ చేసేందుకు విదేశీయులకు అనుమతి ఇవ్వలేదు. ఓసీఐ, పీఐఓ కార్డులు ఉన్నవారితో పాటు విదేశీయులకు ఈ అవకాశం కల్పించింది. దీనికి సంబంధించి గురువారం కేంద్ర హోంశాఖ ఓ ప్రకటన జారీ చేసింది. భారతీయులతో పాటు విదేశీయులకు కూడా ప్రయాణ ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పౌర విమానయానశాఖ ఆమోదించిన విమానాలకు మాత్రమే ఈ ఆంక్షలు వర్తించనున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ జారీ చేసిన నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్, టూరిస్ట్, మెడికల్ వీసాలు తప్ప ఇతర అన్ని వీసాలను పునరుద్దరిస్తున్నట్లు భారత ప్రభుత్వం తెలిపింది. లేటెస్ట్ ఆదేశాలతో… బిజినెస్, కాన్ఫరెన్స్, ఉద్యోగం, విద్య, పరిశోధన, వైద్య సంబంధిత విషయాలకు హాజరయ్యేందుకు విదేశీయులకు అనుమతి ఇచ్చారు అరోగ్యశాఖ అధికారులు.