వార్​రూమ్​లు యాక్టివేట్ చేయండి

వార్​రూమ్​లు యాక్టివేట్ చేయండి
  • ఒమిక్రాన్​ను ఎక్కడికక్కడే కట్టడి చేయాలె
  • వార్​రూమ్​లు యాక్టివేట్ చేయండి
  • రాష్ట్రాలకు కేంద్రం సూచనలు

న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్​ కేసులు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్​ అయింది. ఈ కొత్త వేరియంట్​కు స్పీడెక్కువ కావడంతో దీనిని కట్టడి చేయడానికి అవసరమైతే ‘నైట్​ కర్ఫ్యూ’ పెట్టాలని రాష్ట్రాలకు సూచించింది. వైరస్​ కట్టడికి వార్​ రూమ్స్​ ఏర్పాటు చేయాలని, టెస్టుల సంఖ్య పెంచాలని, ఫంక్షన్లు సహా వివిధ కార్యక్రమాలపై ఆంక్షలు పెట్టాలని పేర్కొంది. ఈమేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రెటరీ రాజేశ్​ భూషణ్​ కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్ర ప్రభుత్వాలకు లెటర్​ రాశారు. డెల్టాతో పోలిస్తే ఈ కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ మూడురెట్లు ఎక్కువ స్పీడ్​తో వ్యాపిస్తోందని వివరించారు. కేసులు బయటపడ్డ ప్రాంతాల్లో కంటైన్​మెంట్​ జోన్లు, ఆంక్షలు పెట్టడం, ఫీల్డ్​ లెవెల్​లో ఎప్పటికప్పుడు పరిశీలన చేయడం ద్వారా మహమ్మారిని అడ్డుకోవచ్చన్నారు. వైరస్​ వ్యాప్తిని కంట్రోల్​ చేయడంలో తీసుకోవాల్సిన చర్యలను, జాగ్రత్తలను సూచించారు.

ఇలా సిద్దం కావాలె..

  • రాష్ట్రంలోకి వైరస్​ ఎంటరైందని తెలిసీతెలియంగానే అలర్ట్​ కావాలి. స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా కట్టడి చర్యలు తీసుకోవాలి. 
  • ఆస్పత్రులలో ఆక్సిజన్​ సపోర్ట్ ఉన్న ఐసీయూ బెడ్లలో 40 శాతం ఆక్యుపెన్సీ ఉన్నా, పాజిటివిటీ రేటు 10 శాతం దాటినా అప్రమత్తం కావాలె.
  • కంటెయిన్​మెంట్​జోన్లు ఏర్పాటు చేసి, వైరస్​ వ్యాప్తిని కేసులు బయటపడ్డ చోటనే ఆపేయాలె.
  • టెస్టులు, సర్వేలెన్స్ పెంచడం, హెల్త్​ వర్కర్లతో ఇంటింటి సర్వే చేయించి కేసుల వివరాలు నమోదు  చేసుకోవడం, కాంటాక్ట్​ ట్రేసింగ్​ పకడ్బందీగా చేయడం.
  • ఒమిక్రాన్​ బయటపడ్డ ఏరియాలో మిగతా పాజిటివ్​ కేసుల శాంపిల్స్ ను జీనోమ్​ సీక్వెన్సింగ్​కు పంపించాలె.
  • రాష్ట్రంలో వంద శాతం వ్యాక్సినేషన్​ కోసం చర్యలు తీసుకోవడం
  • హాస్పిటల్ బెడ్స్, అంబులెన్స్​లు, ఆక్సిజన్​ ఎక్విప్​మెంట్, మందులు తదితర ఎమర్జెన్సీ వైద్య సేవలను రెడీ చేసుకోవడం.