
కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించిన సాహిత్య పురస్కారాల్లో డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ రాసిన కబుర్ల దేవతకు బాల సాహిత్య పురస్కారం లభించింది. ప్రసాద్ సూరి రచించిన మైరావణకు యువ సాహిత్య పురస్కారం లభించింది. ఈ పురస్కారాలు 2025 సంవత్సరానికిగాను ప్రకటించారు. సాహిత్య అకాడమీ 24 భాషల్లో బాలసాహిత్య పురస్కారాలను, 23 భాషల్లో యువ సాహిత్య పురస్కారాలను ప్రకటించింది.
- కబుర్ల దేవత (బాల సాహిత్య పురస్కారం)
- రచయిత: డాక్టర్ గంగిశెట్టి శివకుమార్
- ప్రాంతం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, రాపూరుకు చెందినవారు
చిన్నప్పటి నుంచి బాలసాహిత్యంపై గంగిశెట్టి శివకుమార్ మక్కువ పెంచుకున్నారు. నాలుగో తరగతిలో ఆలీబాబా 40 దొంగలు పుస్తకం చదివి ప్రేరణ పొందారు. ఎస్.వి.యూనివర్సిటీలో తెలుగులో ఎంఏ, బాలల కథలపై పీహెచ్ డీ చేశారు. 1970లో రాసిన కబుర్ల దేవత కథ బాలానందం పుస్తకంలో ప్రచురితమైంది. అదే పేరుతో 2023లో రాసిన పుస్తకానికి ఇప్పుడు పురస్కారం లభించింది. 2005లో ఏపీ ప్రభుత్వం నుంచి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు పొందారు.
మైరావణ (యువసాహిత్య పురస్కారం)
రచయిత: ప్రసాద్ సూరి(అసలు పేరు సూరాడ ప్రసాద్)
ప్రాంతం: విశాఖపట్టణానికి చెందినవారు. విశాఖపట్నం జిల్లా, రాంబిల్లి మండలం, వాడరాంబిల్లిలో 2000, డిసెంబర్ 12న జన్మించారు. హైదరాబాద్ లోని జేఎన్ఏఎఫ్ యూలో 2019–24 మధ్య బీఎఫ్ఏ చేశారు. ప్రస్తుతం గుజరాత్ లోని వడోదరలో ఎంఏ ఆర్కియాలజీ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఈయన మత్స్యకార కుటుంబానికి చెందినవారు. తెలివి, ధైర్యం, బలం ఉన్నవాడికి అదృష్టం కలిసొస్తే ఏం చేస్తాడన్న ఇతివృత్తంతో మైరావణ పుస్తకం రాశారు. ఇది విశాఖ తీర ప్రాంతంలో చేపలు పట్టే బెస్తవాళ్ల జీవిత కథ.
కేంద్ర సాహిత్య అకాడమీ
కేంద్ర సాహిత్య అకాడమీ అనేది భారతీయ సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి, అభివృద్ధి చేయడానికి స్థాపించిన ఒక ప్రముఖ సంస్థ. ఇది భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వశాఖ కింద పనిచేస్తుంది. అయినా దీనికి స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నది. కేంద్ర సాహిత్య అకాడమీ 1954లో స్థాపించారు. భారతీయ భాషల్లో సాహిత్యాన్ని ప్రోత్సహించడం, రచయితలను గుర్తించి గౌరవించడం, వివిధ భారతీయ భాషల మధ్య సాహిత్య మార్పిడిని ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యాలు. కేంద్ర సాహిత్య అకాడమీ ప్రతి సంవత్సరం భారత రాజ్యాంగం గుర్తించిన భాషలతోపాటు తాను పరిగణనలోకి తీసుకున్న మరికొన్ని భాషలు కలిపి అనేక పురస్కారాలను ప్రదానం చేస్తుంది.
సాహిత్య అకాడమీ పురస్కారం: రాజ్యాంగం గుర్తించిన 22 భాషలతోపాటు మరికొన్ని భాషల్లోని ఉత్తమ సాహిత్య రచనలకు ఈ పురస్కారాన్ని అందిస్తారు. వీటిని1955 నుంచి ప్రదానం చేస్తున్నారు.
బాల సాహిత్య పురస్కారం: బాలల సాహిత్యంలో విశేష కృషి చేసిన రచయితలకు లేదా ఉత్తమ బాల సాహిత్య రచనలకు ఈ పురస్కారాన్ని అందిస్తారు.
యువ సాహిత్య పురస్కారం: 35 ఏండ్ల లోపు వయసు గల యువ రచయితలు చేసిన ఉత్తమ సాహిత్య సృ ష్టికి ఈ పురస్కారాన్ని అందిస్తారు.
అనువాద పురస్కారం: వివిధ భారతీయ భాషల మధ్య సాహిత్య అనువాదాలను ప్రోత్సహించడానికి ఈ పురస్కారం ఇస్తారు.