- రూల్స్ దోషుల తరఫున కాదు..బాధితుల కోణంలో ఉండాలె
- నిర్భయ దోషుల ఉరితీతకు ముందు సుప్రీం కోర్టును
న్యూఢిల్లీ: ఉరి శిక్ష అమలుకు సంబంధించిన గైడ్లైన్స్ను మార్చాలంటూ కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. న్యాయ వ్యవస్థపై ప్రజల్లో మరింత నమ్మకం పెరిగేలా డెత్ పెనాల్టీకి సంబంధించి దోషుల కోణంలో ఉన్న గైడ్ లైన్స్ను బాధితుల కోణంలో మార్చాలని హోంమంత్రిత్వ శాఖ కోరింది. సుప్రీంకోర్టుకు అందజేసిన అప్లికేషన్లో.. దోషులు పెట్టుకున్న రివ్యూ పిటిషన్ను కోర్టు తిరస్కరించాక క్యూరేటివ్ పిటిషన్ పెట్టుకోవడానికి టైం లిమిట్ పెట్టాలని హోంశాఖ కోరింది. టైం లిమిట్ లేకపోవడం వల్ల శిక్ష అమలును వీలైనంత పోస్ట్పోన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. నిర్భయ దోషుల ఉరి శిక్ష అమలుకు ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఈ కేసులో నలుగురు దోషులను ఉరి తీయాలంటూ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే! అయితే, దోషులు నలుగురు ఉరిశిక్ష అమలును సాధ్యమైనంత వరకూ పోస్ట్పోన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం చట్టంలో ఉన్న వెసులుబాటును వాళ్ల లాయర్లు ఉపయోగించుకుంటున్నారు. ఈ నెల 22 న వారిని ఉరి తీయాలంటూ ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. శిక్ష అమలు కోసం ఏర్పాట్లు కూడా జరుగుతుండగా.. దోషుల్లో ఒకడైన ముకేశ్ సింగ్ కోర్టులో క్యూరేటివ్ పిటిషన్ పెట్టుకున్నాడు. కోర్టు దానిని తిరస్కరించడంతో రాష్ట్రపతి క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ దరఖాస్తును హోంశాఖ అధికారులు రికార్డు టైంలో ప్రాసెస్ చేసి, దీనిని తిరస్కరించాలని సూచిస్తూ రాష్ట్రపతికి పంపించారు. రాష్ట్రపతి కూడా వెంటనే స్పందించి, ముకేశ్ సింగ్ పిటిషన్ను తిరస్కరించారు. అయితే, క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించాక ఉరి శిక్ష అమలుకు కనీసం 14 రోజుల వ్యవధి ఉండాలనే రూల్ వల్ల దోషుల ఉరి వాయిదా పడింది. దీంతో ఫిబ్రవరి 1న దోషులను ఉరి తీయాలంటూ ఢిల్లీ కోర్టు మళ్లీ ఫ్రెష్ డెత్వారెంట్ జారీ చేసింది. ఈ క్రమంలో మరో ఇద్దరు దోషులకు క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉండడంతో ఈసారి కూడా శిక్ష అమలు జరిగే అవకాశంలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించడం.. దీనిపై సుప్రీం స్పందన ఎలా ఉండబోతోందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.