ఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో వలస కూలీలు ఎక్కడవారు అక్కడే ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం మరోసారి మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్రాలు దాటి వెళ్లేందుకు అనుమతులు లేవని స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు ఉన్న రాష్ట్రంలోనే వారికి పనికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. క్యాంపుల్లో ఉన్నవారి వివరాలు, వారు చేసే పని వివరాలు నమోదు చేయాలని సూచించింది. ఈ మేరకు ఆదివారం హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ పంపారు.
అవకాశం ఉంటే క్యాంపుల సమీపంలో వారికి పని చూపించాలని తెలిపింది. ఆహారం, రవాణా సౌకర్యాలు కల్పించి పనులు కల్పించవచ్చని తెలిపింది. గ్రామాల్లో ఉన్న వలస కూలీలు ఉపాధి హామీలాంటి పనులను కల్పించాలని రాష్ట్రాలకు తెలిపింది. సామాజిక దూరం పాటించేలా చూస్తూ పనులు చేయించుకోవచ్చని సూచించింది.