- ప్రజలకు ఎక్కువగా రీచ్ అయ్యేది ఆ మీడియానే
- సుదర్శన్ టీవీ కేసులో సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్
- ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాపై ఇప్పటికే కంట్రోల్ ఉందని వెల్లడి
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ మీడియాను, టీవీ చానళ్లను రెగ్యులేట్ చేయాలని కోర్టు భావిస్తే అంతకన్నా ముందు డిజిటల్ మీడియాపై దృష్టి పెట్టాలని, ప్రస్తుత కాలంలో డిజిటల్ మీడియా ప్రభావమే చాలా ఎక్కువగా ఉందని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ల ద్వారా ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్గా రీచవుతోందని వివరించింది. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా నియంత్రణకు ఇప్పటికే కచ్చితమైన ఫ్రేమ్వర్క్ ఉందని చెప్పింది. ఈ మేరకు సుదర్శన్ టీవీ ‘బిందాస్ బోల్’ ప్రోగ్రామ్పై దాఖలైన కేసు విషయంలో కోర్టుకు అఫిడవిట్ను ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ గురువారం సమర్పించింది. ముస్లింలను గవర్నమెంట్ సర్వీసుల్లోకి అక్రమంగా పంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆ చానల్ ప్రసారం చేస్తున్న ప్రోగ్రామ్పై పిటిషన్ దాఖలైంది. దీంతో జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రోగ్రామ్ ఎపిసోడ్స్ను టెలికాస్ట్ చేయకుండా రెండ్రోజుల పాటు నియంత్రిస్తూ సెప్టెంబర్ 15న ఆదేశాలిచ్చింది. ఓ కమ్యూనిటీని కావాలనే టార్గెట్ చేశారనే ఉద్దేశంతో టెలికాస్ట్ చేయకుండా ఆపాలని ఆదేశాలిస్తున్నామని తెలిపింది. గురువారం ఈ పిటిషన్పై విచారణ జరిగింది.
ఎక్స్పర్ట్ కమిటీ వేయాల్సిందే..
ఈ కేసు విషయంలో కోర్టుకు కేంద్రం అఫిడవిట్ సమర్పించింది. ‘జర్నలిస్టుల ఫ్రీడమ్, బాధ్యతాయుత జర్నలిజంపై ఇప్పటికే చట్టబద్ధమైన ప్రొవిజన్స్, కోర్టుల జడ్జిమెంట్స్ ఉన్నాయి’ అని అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. ఈ పిటిషన్ సుదర్శన్ టీవీకే పరిమితమని, అయితే ఓ ఎక్స్పర్ట్ కమిటీ వేసి గైడ్ లైన్స్ రూపొందించకుండా ఈ సమస్య పరిష్కారం అయ్యేలా కనిపించడం లేదని చెప్పింది. ఒకవేళ గైడ్లైన్స్ రూపొందించాలనుకుంటే కేవలం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియానే కాకుండా డిజిటల్ ప్రింట్ మీడియా, డిజిటల్ వెబ్ బేస్డ్ న్యూస్ పోర్టల్స్, యూట్యూబ్ చానల్స్, ఓటీటీలనూ లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందంది.
అలాంటి పదాలు వాడాం.. అయితే..
సుప్రీంకోర్టుకు సుదర్శన్ టీవీ కూడా అఫిడవిట్ సమర్పించింది. ఈ ప్రోగ్రామ్ ఒకరిని ఇబ్బంది పెట్టాలనో, ఓ కమ్యూనిటీని టార్గెట్ చేయాలనో కాదని.. నేషనల్ ఇంట్రెస్ట్ను దృష్టిలో పెట్టుకొని రూపొందించిందని వివరించింది. ‘యూపీఎస్సీ జీహాద్’ లాంటి పదాలను ప్రోగ్రామ్లో వాడామని, దానికో కారణం ఉందని చెప్పింది. ముస్లిం యూపీఎస్సీ క్యాండిడేట్లకు కోచింగ్ ఇచ్చే ఓ ఇన్స్టిట్యూట్కు ఫారిన్ నుంచి ఫండ్స్ వస్తున్నాయని, ఉగ్రవాదుల గ్రూప్స్ నుంచి ఆ ఫండ్స్ వస్తున్నాయని ఆరోపించింది.