బీసీల కుల గణనపై కొత్త మోసానికి తెరతీసిన కేంద్రం : కల్వకుంట్ల కవిత

బీసీల కుల గణనపై కొత్త మోసానికి తెరతీసిన కేంద్రం : కల్వకుంట్ల కవిత
  •     ఈ నెల 29న రౌండ్ టేబుల్ సమావేశం: కవిత

హైదరాబాద్, వెలుగు: జనగణనలో బీసీల కులగణనపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త మోసానికి తెరతీసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఫైర్​అయ్యారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సెన్సస్ -2026 డాక్యుమెంట్ లో బీసీల క్లాసిఫికేషన్ కు ఆప్షన్ పెట్టలేదన్నారు. 

ఎస్సీ, ఎస్టీ, అదర్స్ గా సెన్సస్ నిర్వహిస్తే దేశంలో బీసీల సంఖ్య ఎంత ఉందనే విషయం ఎలా బయట పడుతుందని ప్రశ్నించారు. 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సెన్సస్ విషయంలో చేసిన మోసాన్నే ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తున్నదని విమర్శించారు. కేంద్రం తీరుకు నిరసనగా జాగృతి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడ్తామని కవిత చెప్పారు. 

ఈ క్రమంలో ఈ నెల 29న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కుల గణనలో బీసీల సంఖ్య తక్కువ చేసి చూపించారని.. కేంద్రం చేయబోయే కుల గణనలోనైనా బీసీల లెక్క తేలుతుందని అందరం ఆశలు పెట్టుకున్నామని, కానీ కేంద్రం ఇచ్చిన డాక్యుమెంట్ లో బీసీల కాలమ్ లేకపోవడంతో పాటు సబ్ క్యాస్ట్ ను సూచించే కాలమ్ కూడా పెట్టలేదని తెలిపారు. తద్వారా బీసీలను కేంద్ర ప్రభుత్వం వంచించిందన్నారు. బీసీలతో పాటు బీసీలలోని ఉప కులాలను, ఎస్సీ, ఎస్టీల్లోని ఉప కులాలు, ఇతర కులాల్లోని ఉప కులాలను సైతం వేర్వేరుగా లెక్కించాల్సిందేనని కవిత డిమాండ్ చేశారు. కేంద్రం చేసిన మోసంపై బీసీ మేధావులతో మాట్లాడుతున్నానని తెలిపారు. 

29న నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, సంచార జాతులతో పాటు ఇతర కులాల్లోని అన్ని ఉప కులాల వారిని ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఒక్కో కులంలో ఎంత శాతం మంది ఉన్నారు.. ఉప కులాల్లో ఎందరు ఉన్నారు అనే డాక్యుమెంట్ తయారు చేసి తెలంగాణ జాగృతి తరపున కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. బీసీల గణన విషయంలో కేంద్రం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికి ప్రతి ఒక్కరూ తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.