- ఆ కులం ఆఫీసర్లకు అక్షరం ముక్కరాదు, పనిరాదు
- రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నరు:ఎమ్మెల్యే ధర్మారెడ్డి వివాదాస్పద కామెంట్లు
వరంగల్ రూరల్, వెలుగు: అయోధ్య రామ మందిరంపై ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యలు వరంగల్ సిటీని ఓ వైపు అట్టుడికిస్తే.. మరో ప్రోగ్రాంలో ఆయన కులాలపై కూడా నోరు జారారు. 99 శాతం మార్కులు వచ్చిన అగ్రకులాల వారికి ఉద్యోగం రావడంలేదని, చదువు సక్కగారాని ఇతర కులపోళ్లు వాటిని పొందుతున్నారని మాట్లాడారు. ఇయ్యాల రాష్ట్రం మొత్తం నాశనం కావడానికి అలాంటి ఆఫీసర్లే కారణమన్నారు. ఆదివారం హన్మకొండలో జరిగిన ‘ఓసీల రాష్ట్ర మహా గర్జన’ సభలో చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ”ఓ రోజు మా నియోజకవర్గంలో అందరు ఏఈలు కలిసి నా దగ్గరకు వచ్చారు. ఓ మంచి ఆఫీసర్ ఉన్నడు సార్ మీదగ్గర పెట్టుకొండంటే పెట్టుకున్న. తీరా పిలిచి మాట్లాడితే.. ఒక్క అక్షరం ముక్క సక్కగా రాదు ఆయనకు. ఇదే విషయాన్ని ఆయనను పెట్టించిన వాళ్లను అడిగితే.. ‘ఆ ఏంలేదు సార్.. మీరు ఫైల్ పట్టుకుపోయి ఏడ సంతకం పెట్టమంటే ఆడ పెడ్తడు. ఎక్కువ తెలువుంటే అడ్డం దిడ్డం అడుగుతరు.. ఈయన మంచోడు సార్ అవేమీ అడగడు’ అంటూ సమాధానం చెప్పిన్రు. ఏం అడిగినా.. నాకు తెలియదంటడు.. ఆయన ఉన్నతాధికారి” అని దుయ్యబట్టారు. ‘‘ఇయ్యాళ రాష్ట్రం మొత్తంలో ఏ ఆఫీస్కు పోయినా ఉన్నతాధికారులు వాళ్లే ఉన్నరు.. పనిరాదు. జిల్లా అధికారి కూడా వాళ్లే ఉన్నరు.. పనిరాదు. రాష్ట్రం మొత్తం నాశనం అవడానికి వాళ్లే కారణం” అని ఎమ్మెల్యే కామెంట్లు చేశారు. ఆపై.. ఇదేమీ కాంట్రవర్సీ కాదని, అగ్రకులాల ఆవేదన అంటూ పేర్కొన్నారు.