ఆస్కార్ 2023కి నామినేట్ అయిన గుజరాతీ మూవీ

ఆస్కార్ 2023కి నామినేట్ అయిన గుజరాతీ మూవీ

‘ఛలో షో’ అనే గుజరాతీ మూవీ ఆస్కార్ 2023కు నామినేషన్ రేసులో ఎంట్రీ ఇచ్చింది. బెస్ట్ ఇంటర్నేషన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో ఈ మూవీ చోటు దక్కించుకుంది. దీనిపై ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటన రిలీజ్ చేసింది. ఈ ప్రకటనపై ‘ఛలో షో’ మూవీ డైరెక్టర్ నలిన్ పాన్ సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. ఆస్కార్ ఎంట్రీకి తమ సినిమాను నామినేట్ చేసినందుకు ఫిల్మ్ ఫెడరేషన్ జ్యూరీ సభ్యులకు థ్యాంక్స్ చెప్పారు. 

‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరీలో ఆస్కార్ కు ఎంపికైన ఈ సినిమా.. డైరెక్టర్ నలిన్ చిన్నప్పటి జ్ఞాపకాల ఆధారంగా తెరకెక్కింది. చిన్న తనంలో ఆయన సినిమాలకు ఎలా ఆకర్షితులయ్యాడు...? వెండితెర, సినిమాపై ఎంత ఇష్టం పెంచుకున్నారు..? అనే అంశాలతో సినిమా రూపొందింది. గుజరాత్ రాష్ట్రంలోని గ్రామీణ వాతావరణం అప్పట్లో ఎలా ఉండేదో నలిన్ కళ్లకు కట్టినట్టు చూపించారు. తొమ్మిదేళ్ల బాలుడి కథగా తెరకెక్కిన ఈ చిత్రంలో భవిన్ రాబరి, భవేశ్ శ్రీమాలి, రిచా మీనా, దిపెన్ రావల్, పరేశ్ మెహతా మెయిన్ రోల్స్ లో నటించారు. ‘లాస్ట్  ఫిల్మ్ షో’ పేరుతో ఈ సినిమా గతేడాది జూన్ లో ‘ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్’లో ప్రదర్శించారు. ఈచిత్రం పలు అంతర్జాతీయ వేడుకల్లోనూ సత్తా చాటింది. ఈ చిత్రం 2022 అక్టోబరు 14న థియేటర్లలోకి రాబోతుంది.

మరోవైపు తెలుగు సినిమా సత్తాను చాటిన ట్రిపుల్ ఆర్ మూవీకి నిరాశే ఎదురైంది. అనేక రికార్డులు బ్రేక్ చేసిన ఈ మూవీ 2023 ఆస్కార్ నామినేషన్ రేసులో ఎంట్రీ దక్కలేదు. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా ఆస్కార్ రేసులో ఉందని ఎంతో ప్రచారం జరిగింది. అటు కశ్మీర్ ఫైల్స్ మూవీకి కూడా ఆస్కార్ రేసులో చోటు దక్కలేదు.