చికెన్​ వేస్టేజీకి ఫుల్​ డిమాండ్

చికెన్​ వేస్టేజీకి ఫుల్​ డిమాండ్
  • క్యాట్​ ఫిష్, పందులకు ఆహారంగా చికెన్​ వ్యర్థాలు
  • సేకరణ టెండర్ కు​పోటాపోటీ
  • రూ.లక్షల్లో గుడ్​విల్  ఇస్తామంటున్న కాంట్రాక్టర్లు

వనపర్తి, వెలుగు:  కోళ్ల వ్యర్థాలను అమ్ముకుంటే రూ.లక్షలు కాదు.. రూ.కోటి వరకు సంపాదించవచ్చని కాంట్రాక్టర్లు భావిస్తున్నారు. పట్టణాల్లోని చికెన్​ సెంటర్ల నుంచి వ్యర్థాలను సేకరించి దూరంగా పారేయడానికి టెండర్​దారులు పోటీ పడుతుండడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. చికెన్​ వేస్టేజీని పందులు, క్యాట్​ఫిష్​కు ఆహారంగా వినియోగించడమే ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు. టెండర్​ తమకే దక్కేలా చూస్తే రూ.లక్షల్లో ముట్టచెబుతామని మున్సిపల్​ ఆఫీసర్లు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు.

రెండేండ్లుగా టెండర్​ దక్కించుకున్న కాంట్రాక్టర్​ మున్సిపాలిటీలోని ప్రధాన ప్రజాప్రతినిధికి రూ.10 నుంచి రూ.15 లక్షల దాకా గుడ్​విల్​ ఇచ్చినట్లు తాజాగా బయటపడింది. ఈసారి పాలకవర్గం మారడంతో టెండర్​ రెన్యూవల్​ చేయించినా, టెండర్​  తమకే దక్కేలా చూసినా రూ.18 లక్షల వరకు గుడ్​విల్​ ఇస్తామంటూ ఆఫర్​ పెడుతున్నారు. అయితే స్థానిక ప్రజాప్రతినిధులు అంగీకరించకపోవడంతో, ఎవరితో సిఫారసు చేయిస్తే పని అవుతుందోననే ఉద్దేశంతో పాలక పార్టీ నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇదిలాఉంటే రూ.25లక్షలు ఇస్తే పని అవుతుందని కొందరు బేరం పెట్టినట్లు సమాచారం.

ఈ సారే పోటీ ఎందుకు?

కొన్నేండ్లుగా చికెన్​ వ్యర్థాలను సేకరించి బయట పారబోస్తున్నారనే అనుకుంటున్నారు. కాని చికెన్​ వ్యర్థాలను సేకరించేందుకు పోటీ పడడమే కాకుండా, రూ.లక్షల్లో గుడ్​విల్​ ఇవ్వడానికీ పోటీ పడుతుండడంతో అసలు చికెన్​ వేస్టేజీని ఏం చేస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క వనపర్తి జిల్లా కేంద్రంలోని చికెన్​ సెంటర్ల నుంచి సేకరించిన టన్నుల కొద్దీ చికెన్​ వేస్టేజీతో కాంట్రాక్టర్​కు కాసుల పంట పండుతోంది. అందుకోసమే గుడ్​విల్​ కింద రూ.25లక్షలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఒక్క వనపర్తిలోనే కాకుండా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రధాన మున్సిపాలిటీల్లో ఇదే తంతు నడుస్తోంది. తాజాగా షాద్​నగర్​ మున్సిపాలిటీలో చికెన్​ వ్యర్థాల టెండర్​ దక్కించుకునేందుకు పైరవీలు చేస్తుండగా, ఎమ్మెల్యే జోక్యం చేసుకొని టెండర్​ పారదర్శకంగా నిర్వహించాలని మున్సిపల్​ అధికారులను ఆదేశించారు. 

క్యాట్​ ఫిష్, పందులకు మెయిన్​ ఫుడ్..

చికెన్​ వేస్టేజీని సేకరించిన కాంట్రాక్టర్లు వాటిని క్యాట్​ ఫిష్​ పెంచే వ్యాపారులకు అమ్ముతుండడంతో వేస్టేజీకి డిమాండ్​ పెరిగింది. క్యాట్​ ఫిష్​లకే కాకుండా పందులకూ ఆహారంగా వీటిని వేస్తున్నారు. పందుల పెంపకందారులు కూడా చికెన్​ వేస్టేజీని గతంలో నేరుగా చికెన్​ సెంటర్ల నుంచి తీసుకెళ్లేవారు. వేస్టేజీకి డిమాండ్  పెరగడంతో వారికి దొరకడం లేదు. దీంతో కాంట్రాక్టర్ల నుంచే కొనాల్సి వస్తోంది. జిల్లా కేంద్రంలో రోజూ నాలుగు బొలేరో వాహనాల చికెన్​ వేస్టేజీని సేకరిస్తున్నారు. అంటే దాదాపు 15 మెట్రిక్​ టన్నుల వేస్టేజీని సేకరిస్తున్నారన్న మాట.

జిల్లాలో క్యాట్​ ఫిష్​ పెంపకం లేదని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నా, పక్కనే ఉన్న జోగులాంబ గద్వాల జిల్లాలో క్యాట్​ ఫిష్​ పెంచుతున్నట్లు తెలిసింది. చికెన్​ వేస్టేజీని ముందుగా గిర్నీలాంటి యంత్రంలో వేసి చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి సప్లై చేస్తున్నారు. మామూలు దాణా కంటే ఈ వేస్టేజీ తింటే చేపలు త్వరగా బరువు పెరుగుతాయి. దీంతో గిట్టుబాటవుతుందని వ్యాపారులు ఈ వేస్టేజీపై దృష్టి పెడుతున్నారు. ఇక చికెన్​ వేస్టేజీని వేరే చేపలకు వేస్తున్నారన్న విషయాన్ని మత్స్యశాఖ అధికారులు కొట్టిపారేస్తున్నారు. ఒక్క క్యాట్​ ఫిష్​ మినహా మిగతా ఏ చేపలు ఈ వేస్టేజీని తినవని అంటున్నారు.  ఫంగషియా జాతికి చెందిన చేపలు తింటాయని వారు చెబుతున్నారు. ఇదిలాఉంటే చేపల చెరువుల వద్ద చికెన్​ వేస్టేజీ వేయడంతో పక్కనే దుర్వాసన వస్తోందని, దీంతో తాము రోగాల బారిన పడుతున్నామని రైతులు వాపోతున్నారు. 

పారదర్శకంగా టెండర్లు..

చికెన్​ వేస్టేజీ సేకరణకు సంబంధించి ఈ నెల 12న టెండర్​ వేస్తున్నాం. టెండర్లు పారదర్శకంగా నిర్వహిస్తాం. గుడ్​విల్, పైరవీలకు తావు లేకుండా చూస్తాం. 

పూర్ణచందర్, మున్సిపల్​ కమిషనర్, వనపర్తి