సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేగింది. ఓ ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కిచెన్లో వంట గ్యాస్ లీకై పేలడంతో క్షణాల వ్యవధిలోనే మంటలు ఇల్లంతా వ్యాపించాయి. అయితే ప్రమాదం జరిగిన వెంటనే ఇంట్లో ఉన్నవారు అప్రమత్తమై ప్రాణాలు చేతపట్టుకుని బయటకు పరుగులు తీయడంతో తృటిలో పెద్ద ప్రాణాపాయం తప్పింది.
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఒక ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) సిబ్బంది, గోపాలపురం పోలీసులు యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. కిచెన్లోని వస్తువులన్నీ ఈ ప్రమాదంలో కాలి బూడిదయ్యాయి. సిలిండర్ల వాడకంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
