- మద్దూరు ఉమాశంకర్పై చీటింగ్ కేసులు
- మూడు కేసుల్లో నాన్ బెయిలబుల్ వారెంట్స్
- సెర్చ్ చేసి అరెస్ట్ చేసిన సీఐడీ స్పెషల్ సెల్
హైదరాబాద్,వెలుగు:ఆధ్యాత్మిక గురువు పేరుతో మోసాలకు పాల్పడిన మద్దూరు ఉమాశంకర్(41)ను సీఐడీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మూడు నాన్ బెయిలబుల్ వారెంట్స్(ఎన్బిడబ్ల్యూ)ను అమలు చేశారు.కోర్టులో హాజరుపరిచి చంచల్గూడ జైలులో రిమాండ్కు తరలించారు. సీఐడీ చీఫ్ మహేష్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం. కొత్తపేట పరిధి ఆర్కే పురం ప్రాంతానికి చెందిన ఉమాశంకర్ తనకు తాను ఆధ్యాత్మిక గురువుగా ప్రచారం చేసుకున్నాడు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు,ఆశ్రమాలు,గోశాలలు,నైట్ షెల్టర్లు, వృద్ధాశ్రమాలు,పేదవిద్యార్థులకు ఉచిత విద్య అందిస్తామని నమ్మించేవాడు.
'అవర్ ప్లేస్' పేరుతో 2006 నుంచి 2009 వరకు రూ. 34.34 కోట్లు వసూలు చేశాడు.ఉమాశంకర్ మోసాలను గుర్తించిన దాతలు 2015లో చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు తీవ్రత నేపథ్యంలో సిటీ సీసీఎస్ పోలీసులు కేసులు నమోదు చేసి సీఐడీకి ట్రాన్స్ఫర్ చేశారు. పోలీసులు ఉమాశంకర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కోర్టు విచారణకు హాజరుకావడంతో ఉమాశంకర్పై నాంపల్లి కోర్టులో 3 నాన్ బెయిలబుల్ వారెంట్స్ జారీ అయ్యాయి. వారెంట్ పెండింగ్లో ఉండడంతో సీఐడీ స్పెషల్ సెల్ సెర్చ్ చేసింది. ఉమాశంకర్ను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించింది.