
ముషీరాబాద్, వెలుగు: జాగాలు ఇస్తామని చెప్పి, యూనియన్ లీడర్లు తమను మోసం చేస్తున్నారని తెలుగు సినీ టీవీ కాస్ట్యూమ్స్ వర్కర్స్ యూనియన్ ఆరోపించింది. ఎకరాల కొద్ది భూమి ఉంటే 50 గజాలు మాత్రమే ఇస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆదివారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో తెలుగు సినీ టీవీ కాస్టూమ్స్ వర్కర్స్ యూనియన్ హౌసింగ్ గ్రూప్ సభ్యులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు రమేశ్, రాజు, ఎస్.కె బాజీ, ఏడుకొండలు, నాగు, మస్తాన్ మాట్లాడుతూ.. 8 ఏండ్లుగా 335 సభ్యులను యూనియన్ లీడర్లు మభ్య పెడుతున్నారన్నారు.
ఆమనగల్లులో 16.36 ఎకరాల ల్యాండ్ ఉంటే తమకు 50 గజాలు మాత్రమే ఇస్తామని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అది కూడా నాలుగేండ్ల తర్వాత డెవలప్ చేసి ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. తమను మోసం చేస్తున్న యూనియన్ లీడర్లు, డెవలపర్లపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నేత కుమారస్వామి, టి మోహన్, అశోక్, సర్వేశ్వరరావు, ఎస్ రమేశ్, రమణ
పాల్గొన్నారు.